వైస్ కెప్టెన్గా బాధ్యతలు:
ఐపీఎల్ 2020లో కండరాల గాయం వల్ల ఇప్పటికే గత రెండు మ్యాచ్లకు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మను సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్ల్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి లోకేశ్ రాహుల్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక రోహిత్ స్థానంలో పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2020లో పంజాబ్ తరఫున రాహుల్, మయాంక్ అదరగొడుతున్న విషయం తెలిసిందే.
ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా:
ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం 595 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. అంతేకాదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఓ దశలో వరుస ఓటములతో డీలాపడిన పంజబ్ జట్టు.. ప్లే ఆప్స్ వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే వరుసగా ఐదు విజయాలు సాధించి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. అంతేకాదు ఇపుడు నాలుగో స్థానం నాదే అన్న ధీమాతో ఉంది. దీనికంతటికి కారణం రాహుల్ కెప్టెన్సీనే.
భవిష్యత్తులో కెప్టెన్సీ:
గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోన్న కేఎల్ రాహుల్ భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. భారత జట్టుకు వికెట్ కీపర్ పాత్రలోనూ అదరగొడుతున్నాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడ ఆడినా.. పరుగులు చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020లో మూడు పాత్రలో (బ్యాట్స్మన్, కెప్టెన్, కీపర్) రాణిస్తున్నాడు. ఆసీస్ పర్యటనలో రోహిత్ గైర్హాజరీతో వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా బీసీసీఐ అతడికి సరైన గుర్తింపు ఇచ్చింది. ఇక భవిష్యత్తులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు. రాహుల్కు వైస్ కెప్టెన్సీ అప్పగించడం పట్ల భారత మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్లేఆఫ్స్ రేసులో ముందు:
సోమవారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ విక్టరీ కొట్టింది. కోల్కతాపై విజయం సాధించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 12 మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్ అంతరంతో కోల్కతాను పంజాబ్ వెనక్కి నెట్టింది. ప్లేఆఫ్ రేసులో నాలుగో స్థానం కోసం జరుగుతున్న పోరులో ఇప్పటి వరకూ కోల్కతా ముందుండగా.. సోమవారం జరిగిన మ్యాచ్లో గెలుపొందడం ద్వారా పంజాబ్ ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లింది. కోల్కతా, పంజాబ్ జట్లలో ఒకటే నాలుగో స్థానం దక్కించుకోనుంది.