
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో భాగంగా గురువారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ పరాజయం కావడం ఆ జట్టు ఫ్రాంఛైజీలో తీవ్ర నిరాశను మిగిల్చింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ ఓడిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమౌతోంది. గెలవాలంటే.. చివరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించాడు. కోల్కత బౌలర్ల దుమ్ము దులిపాడు. వరుస సిక్సర్లతో విరుచుకుని పడ్డాడు.
చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగడం క్రికెట్ ప్రేమికులకు ఉత్కంఠతకు గురి చేసింది. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టింది. దీనికి కోల్కత టీమ్ మేనేజ్మెంట్ గానీ, ఫ్రాంఛైజీ పెద్దలు గానీ మినహాయింపు కాదు. దుబాయ్ స్టేడియంలో తమ జట్టు విజయం కోసం చివరి బంతి వరకూ ఉత్కంఠతగా ఎదురు చూసింది కోల్కత ఫ్రాంఛైజీ. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, కోల్కత కో-ఓనర్ జుహీచావ్లా నరాలు తెగే ఉత్కంఠతను చవి చూసి ఉండొచ్చు. తమ జట్టులో స్ఫూర్తినింపాడానికి ఆమె ఎమిరేట్స్కు బయలుదేరి వెళ్లారు. జట్టుతో పాటు అక్కడే ఉంటున్నారు. గురువారం రాత్రి నాటి మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో కనిపించారు.
చివరి రెండు ఓవర్లకు 30 పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా భారీ షాట్లు ఆడుతుండటంతో జుహీచావ్లా ఆందోళనగా కనిపించారు. ప్రత్యేకించి- చివరి ఓవర్లో ఆమె తీవ్ర ఉత్కంఠతకు గురయ్యారు. చివరి మూడు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో జుహీచావ్లా ఏకంగా ప్రేయర్ చేస్తూ కనిపించడం.. ఆమె మానసిక స్థితికి అద్దం పట్టింది. అయినప్పటికీ.. కోల్కత గెలవలేకపోయింది. ఆ మూడు బంతుల్లో రెండింటిని సిక్సర్లుగా మలిచాడు రవీంద్ర జడేజా. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. జుహీచావ్లాకు సంబంధించిన ఫొటోలు, స్క్రీన్ షాట్లు.. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.