డుప్లెసిస్కు గాయం?
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బాగా ఆడుతున్న 'ఒకేఒక్కడు' ఫాఫ్ డుప్లెసిస్. చెన్నై ఆడిన ఐదు మ్యాచుల్లో ఫాఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నిలకడగా రాణిస్తూ వరుసగా 58, 72, 43, 22, 87 రన్స్ చేశాడు. ఇందులో రెండు నాటౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ 282 రన్స్ చేసిన డుప్లెసిస్.. కేఎల్ రాహుల్ (302) తర్వాతి స్థానంలో ఉన్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న డుప్లెసిస్కు గాయం అయినట్టు తెలుస్తోంది. పంజాబ్తో మ్యాచ్ తర్వాత చెన్నై విడుదల చేసిన ఓ వీడియోలో డుప్లెసిస్ మోకాలికి ఐస్ బ్యాగ్ పెట్టుకొని నడుస్తూ కనిపించాడు.
గాయం తీవ్రమైతే
చెన్నై విడుదల చేసిన ఓ వీడియోలో ఫాఫ్ డుప్లెసిస్ మరీ ఇబ్బంది పడుతున్నట్లుగా మాత్రం కనిపించలేదు. అయితే చెన్నై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అతడికి అయిన గాయం చిన్నదే అని అర్ధమవుతోంది. ఒక వేళ డుప్లెసిస్ గాయం తీవ్రమైతే మాత్రం చెన్నైపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఎందుకంటే ఈ సీజన్లో డుపెస్లిస్ అద్భుతంగా రాణిస్తున్నాడు. చెన్నై బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోగా ఫాఫ్ ఫిట్నెస్ సాధిస్తే.. చెన్నైకి పెద్ద తలనొప్పి తగ్గనుంది. అంబటి రాయుడు, షేన్ వాట్సన్ తలో హాఫ్ సెంచరీ చేసినా.. నిలకడగా ఆడలేకపోతున్నారు. దీంతో చెన్నై డుపెస్లిస్పైనే ఆశలు పెట్టుకుంది.
హోరాహోరీగా తలపడ్డాయి
చెన్నై, పంజాబ్ ఆదివారం రాత్రి తలపడ్డాయి. రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఎందుకంటే.. అప్పటికే నాలుగు మ్యాచులాడి మూడింట్లో ఓడిపోయాయి. అందుకే హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ మొదట 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (63), మయాంక్ అగర్వాల్ (26), నికోలస్ పూరన్ (33) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో పంజాబ్ బౌలింగ్ను చెన్నై ఓపెనర్లు ఆడుకున్నారు. వికెట్లేమీ నష్టపోకుండా 17.4 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది.
Sunrisers Hyderabad: భువనేశ్వర్ స్థానంలో తెలుగు బౌలర్కు ఛాన్స్.. ఎవరో తెలుసా?