IPL 2020: మరో రికార్డుకు చేరువలో విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్.. ఏంటో తెలుసా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో ఈ మెగా టోర్నీ ప్రారంభమైంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ప్రారంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చతికిల పడటం శరామామూలుగానే మారింది. శనివారం జరిగిన చెన్నై ముంబై మధ్య మ్యాచ్లో సిక్సర్లు, ఫోర్లు, అద్భుతమైన క్యాచ్లు కనిపించాయి.
ప్రేక్షకులు లేకపోయినప్పటికీ టీవీలో మ్యాచ్ను వీక్షిస్తున్న వారికి మాత్రం ఎంటర్టెయిన్మెంట్ కొదవ లేకుండా పోయింది. రికార్డింగ్ సౌండ్స్తో నిర్వాహకులు చాలా చక్కగా ప్లాన్ చేసి స్టేడియంలో ప్రేక్షకులు ఉన్నారనే అనుభూతిని కలిగించారు. ఇక ఆదివారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య భీకర పోరుకు దుబాయ్ స్టేడియం సిద్ధం అవుతోంది. ఈ మ్యాచ్లో ఒక రికార్డు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో రికార్డు దిశగా క్రిస్ గేల్
ఆదివారం జరగనున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అరవీర భయంకరుడు క్రిస్గేల్ మరో రికార్డుకు కొన్ని పరుగుల దూరంలో ఉన్నాడు. క్రిస్ గేల్ ఒక్కసారి రెచ్చిపోయాడంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. అలాంటి మ్యాచ్ ఆదివారం జరగనుంది. బంతిని స్టేడియం బయటకు పంపగల సత్తా ఉన్న క్రిస్గేల్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు తన ఖాతాలోకి వేసుకుంటే ఐపీఎల్లో 4500 పరుగుల మార్కును క్రాస్ చేసిన రెండో విదేశీ ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డులకు ఎక్కనున్నాడు. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 4500 పరుగుల మార్కును టచ్ చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

రెండో విదేశీ ఆటగాడిగా క్రిస్ గేల్
క్రిస్ గేల్ ఇప్పటి వరకు 125 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా 4,484 పరుగులు చేశాడు. 4500 పరుగుల మార్కును తాకేందుకు మరో 16 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ 16 పరుగులు ఆదివారం జరిగే మ్యాచ్లో చేస్తే కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇక మొత్తంగా చూస్తే అంటే ఇటు స్వదేశీ ఆటగాళ్లు ఇటు విదేశీ ఆటగాళ్ల రికార్డులను పరిశీలిస్తే 4500 పరుగుల మార్కను తాకిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ ఆరవ వాడిగా నిలుస్తాడు. విరాట్ కోహ్లీ 177 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 5412 పరుగులు చేయగా, సురేష్ రైనా 193 మ్యాచుల్లో 5368 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 188 మ్యాచుల్లో 4,898 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 126 మ్యాచుల్లో 4,706 పరుగులు చేశాడు. ఇక శిఖర్ ధవన్ 159 మ్యాచుల్లో 4,567 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్ కూడా...
ఇదిలా ఉంటే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు తొలిసారిగా నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్లో 2000 పరుగుల మార్కును టచ్ చేసేందుకు 23 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్లో కనుక ఈ 23 పరుగులు చేస్తే 2000 పరుగుల మార్కును తాకిని 20వ భారత ఆటగాడిగా పేరు నమోదవుతుంది. ఇక పంజాబ్ జట్టు సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు కేఎల్ రాహుల్. జట్టు అద్భుతంగా ఉందని ఈ సారి వండర్స్ క్రియేట్ చేయగలమనే నమ్మకం తనకుందన్నాడు. ఈ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి ఆటతీరును జట్టు ప్రదర్శిస్తుందన్న కాన్ఫిడెన్స్ను కేఎల్ రాహుల్ వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications