న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చిందని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం వెల్లడించారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరగనున్నాయి.
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా ఐపీఎల్ లీగ్ను యూఏఈలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం గత వారం బీసీసీఐకి సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ కలిసి లీగ్ షెడ్యూల్ విడుదల చేశాయి. ఇక ఈ రోజు యూఏఈలో ఐపీఎల్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేసారు. దీంతో ఐపీఎల్పై ఉన్న కాస్తోకూస్తో ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. ఇక లీగ్ ప్రారంభం కావడం మాత్రమే మిగిలుంది.
'అవును. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. లిఖిత పూర్వకంగా పత్రాలు మాకు అందాయి. ప్రభుత్వ నుంచి హామీ అందిన వెంటనే లీగ్ను యూఏఈలో నిర్వహించనున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు సమాచారమిచ్చాం. ఇప్పుడు అధికారికంగా పత్రాలు కూడా అందిస్తాం' అని బ్రిజేశ్ పటేల్ తెలిపారు.
ఐపీఎల్ 2020 కోసం ఇప్పటికే బీసీసీఐ స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ప్రకటించింది. భారీ నియమావళిని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఆటగాళ్లు సైతం ఇంటి వద్ద, సమీపంలోని మైదానాల్లో సాధన చేస్తున్నారు. అయితే చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్గా కొనసాగుతున్న 'వివో' మొబైల్ ఈ ఏడాదికి ఒప్పందం రద్దు చేసుకుంది. భారీ ఎత్తున వ్యతిరేకత రావడంతో విముఖత చూపించింది. దాంతో ఫ్రాంచైజీలు, బీసీసీఐ కలిసి దాదాపు రూ.440 కోట్ల వరకు నష్టపోనున్నాయి.
త్వరలోనే టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించనుంది. అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిసింది. టాటా గ్రూప్, కోకాకోలా కూడా రేసులో ఉన్నట్టు వినికిడి. తాజాగా యోగా గురు బాబ్ రాందేవ్కి చెందిన 'పతంజలి' కూడా ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్షిప్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్ కోసం ఈ అవకాశం అందుకోవాలని అమెజాన్ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పుడు పతంజలి సైతం రావడంతో పోటీ ఎక్కువైంది. అయితే ఎవరు ఎంత మొత్తానికి టెండర్ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎవరూ రూ.200 నుంచి 250 కోట్లకు మించి చెల్లించకపోవచ్చని అంచనా.
యుజ్వేంద్ర చహల్కు కాబోయే సతీమణి ధనశ్రీ గురించి తెలుసా?!!