దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన భారత క్రికెట్ బృందాన్ని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను కలవర పెట్టిన కరోనా.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు పాకింది. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణ కోసం వచ్చిన బీసీసీఐ అధికారి (మెడికల్ టీమ్ సభ్యుడు) ఒకరు తాజాగా కరోనా బారిన పడ్డారని తెలిసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది.
'బీసీసీఐ బృందంలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. అతడు క్రికెట్ నిర్వహణ బృందం లేదా వైద్య బృందానికి చెందిన వ్యక్తా అన్నది చెప్పలేను. ప్రస్తుతం ప్రాబ్లం ఏమీ లేదు. అతను ఐసోలేషన్లో ఉన్నాడు. ఎవరితోనూ అతని కాంటాక్ట్ లేదు. యూఏఈకి వెళ్లే సమయంలో కూడా ఏ క్రికెటర్తోనే అతను కాంటాక్ట్ కాలేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, లక్షణాలు లేకుండా కనిపిస్తున్నారు. అంత ఆందోళన పడాల్సిందేమీ లేదు' అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అంత సులభమేమీ కాదనిపిస్తోంది. అందరూ బయో బుడగలోనే ఉంటున్నా.. ఏదో ఒక విధంగా కరోనా వైరస్ కాటేస్తోంది.
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. పేసర్ దీపక్ చాహర్, యువ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్కు కరోనా సోకింది. ఇక అధికారులు, సామాజిక మాధ్యమ బృందాల్లో కొందరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ జట్టంతా 14 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో మిగతావారికి కరోనా నెగిటివ్ రావడంతో సీఎస్కే ఊపిరి పీల్చుకుంది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న ఇద్దరు సభ్యలకు కరోనా సోకిన విషయాన్ని సైతం బోర్డు సీనియర్ అధికారి ప్రకటించారు. ఐపీఎల్ 2020 కవర్ చేసేందుకు వెళ్లే స్టార్ బృందంలోనూ ఒకరికి వైరస్ సోకడంతో ప్రయాణం నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా భయంతో సురేశ్ రైనా, లసిత్ మలింగ వంటి క్రికెటర్లు టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. హర్భజన్ సింగ్ మంగళవారమే దుబాయ్లో సీఎస్కేతో కలవాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతడి ప్రయాణంపై సమాచారం లేదు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్ జరగనుంది.
CPL 2020: హెట్మైర్ వీరోచిత ఇన్నింగ్.. సెమీస్కు గయానా అర్హత!!