కెప్టెన్గా ధోనీ ఫ్లాఫ్
ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ ఇంతలా ఫ్లాఫ్ అవుతాడని ఎవరూ ఊహించరు. ఇలా ఆడుతాడని తెలిస్తే అతని అభిమానులే బరిలోకి దిగనిచ్చేవారు. ఒక కీపింగ్లో మినహా కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా ధోనీ విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ చేయడంలో తడబడుతుంటే ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయకపోవడం అందరిని విస్మయ పరిచింది. పైగా యువ ఆటగాళ్లలో ఆ స్పార్క్ కనిపించలేదనే అతని మాటలు ఆశ్చర్యం కలిగించాయి.
టీ20ల్లో ఏ జట్టుకైనా పవర్ప్లేలో చేసే పరుగులు అత్యంత కీలకం. కానీ ఈసారి పవర్ప్లేలో చెన్నై ఆట అన్ని మ్యాచ్ల్లో టెస్టులను తలపించింది. వికెట్లు కాపాడుకొని... చివర్లో చెలరేగిపోవచ్చనే వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. బ్యాట్స్మెన్ వైఫల్యంతో సూపర్ కింగ్స్ నుంచి ‘భారీ స్కోరు' అనే మాట వినిపించడమే గగనంగా మారింది. ఆదివారం సూపర్ ఓవర్ల తర్వాత ఒక చెన్నై అభిమాని ‘మా జట్టుకు ఎప్పుడైనా సూపర్ ఓవర్ ఆడే అవకాశమే రాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్లు నిలదొక్కుకునే లోపే ఓవర్ ముగిసిపోతుంది' అంటూ చేసిన సరదా వ్యాఖ్య పరిస్థితిని తెలియజేస్తోంది.
సీనియర్ సిటిజన్స్ టీమ్..
చెన్నై జట్టులో ఒకటి రెండు వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా చూస్తే అందరి వైఫల్యం కనిపిస్తుంది. జట్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం, వారికి తగినంత ప్రాక్టీస్ లేకపోవడం దెబ్బతీసింది. ఆటగాళ్లకు ‘కంటిన్యుటీ' సమస్య బాగా కనిపించింది. జట్టుకు దిక్సూచి లాంటి ధోనీనే స్వయంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు. అందుకే ఎంత ప్రయత్నించినా ఆ షాట్లలో పదును కనిపించలేదు, బ్యాటింగ్లో చురుకుదనం కనిపించలేదు. వాట్సన్, బ్రేవో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఇతర లీగ్లలో పాల్గొంటున్నా... ఐపీఎల్తో పోలిస్తే వాటి ప్రమాణాలు పేలవం. కేదార్ జాదవ్ సంగతి సరే సరి.
దెబ్బతీసిన ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు..
ఇక చెన్నై సూపర్ కింగ్స్ను ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు కూడా దెబ్బతీశాయి. కెప్టెన్ ధోనీతో సహా సీనియర్ ఆటగాళ్లంతా తెగ ఇబ్బంది పడ్డారు. స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఫిట్నెస్ సమస్యలతోనే ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక ఆరంభ మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాన్నందించిన అంబటి రాయుడు తొడ కండరాలు పట్టేయడంతో తర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా అతనిలో ఆ దూకుడు కనిపించలేదు. క్విక్ రన్నర్గా పేరున్న ధోనీ కూడా దుబాయ్లోని వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. జాదవ్ అయితే పరుగు తీయలేక కూర్చిండిపోయాడు. స్ట్రైక్ రొటేట్ చేసే విషయంలో సీనియర్ ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో బ్రావో గాయంతో మైదానం వీడటం జట్టు ఓటమికి దారి తీసింది. చివరి ఓవర్లో అతను అందుబాటులో ఉంటే చెన్నై విజయంతో పాటు రేసులో ఉండేది.
సురేశ్ రైనా, భజ్జీ గైర్హాజరీ..
ఇక చెన్నై సూపర్ కింగ్స్లో సురేశ్ రైనా ఎంత కీలకమో ఈ సీజన్తో అందరికి స్పష్టమైంది. అతని లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ధోనీ సగం బలం సురేశ్ రైనానే అని స్పష్టమైంది. అతను లేకుండా 2016 సీజన్లో రైజింగ్ పుణేను నడిపించిన ధోనీ ఇలానే విఫలమయ్యాడు. పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంతో సరిపెట్టి రైజింగ్ పుణేలో కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఇక ఆఫ్ స్పిన్నర్ భజ్జీ లేకపోవడం కూడా జట్టును దెబ్బతీసింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ పిచ్లపై అతను కీలకమయ్యేవాడు. సర్వం తానే అయి వ్యవహరించే ధోనీ... రైనా, హర్భజన్లాంటి ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దూరమైతే, కనీసం వారి స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం తనపై తనకు ఉన్న అతి నమ్మకమని చెప్పవచ్చు.
IPL 2020: ఆ లెక్కన కింగ్స్ పంజాబ్దేనా టైటిల్.. అప్పటి చెన్నైలా చెలరేగుతుందా?