

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అంతకముందు సన్రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్స్టో (114: 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులు), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్: 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీలు సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఐపీఎల్లో సన్రైజర్స్కు అత్యధిక స్కోరు కావడం విశేషం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ జట్టులో ఓపెనర్లు తొలి వికెట్కి అభేద్యంగా 16.2 ఓవర్లలోనే 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బెయిర్ స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, మరో 24 బంతుల్లో సెంచరీ మార్కును చేరాడు.
మరోవైపు వార్నర్ 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేయగా, మరో 22 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం బెయిర్స్టో... స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరగా ఆఖరి ఓవర్లో డేవిడ్ వార్నర్ కూడా సెంచరీని నమోదు చేశాడు.