
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 213 లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
213 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విఫలమైంది. పంజాబ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (79) హాఫ్ సెంచరీతో రాణించగా... క్రిస్ గేల్(4), మయాంక్ అగర్వాల్(27), నికోలస్ పూరన్ (21), డేవిడ్ మిల్లర్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. సన్రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషిద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీయగా, సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయడం ద్వారా ఐపీఎల్లో సన్ రైజర్స్ తరుపున 50 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్కి ఇది ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఈ సీజన్లో మొత్తం 12 మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులతో ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో వార్నర్ అత్యధిక స్కోరు 100.
పంజాబ్ విజయ లక్ష్యం 213
అంతకముందు డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 81 (7 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. దీంతో పంజాబ్కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ ఇన్నింగ్స్ను దాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు వార్నర్-సాహాలు చెలరేగి ఆడారు. తొలి వికెట్కు 78 పరుగులు జోడించారు. సాహా(28) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(36)తో కలిసి వార్నర్ పరుగుల వరద పారించాడు. ఈక్రమంలో ఐపీఎల్లో 44వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ 82 పరుగులు జోడించిన చేసిన తర్వాత మనీష్ పాండే ఔటయ్యాడు. దీంతో సన్రైజర్స్ 160 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికి వార్నర్ కూడా అశ్విన్ బౌలింగ్లో ముజీబ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-నబీల జోడీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 34 పరుగులు జోడించారు. అయితే 19 ఓవర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో స్కోరులో వేగం తగ్గింది. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే రావడంతో సన్రైజర్స్ 212 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో షమీ, అశ్విన్లు తలో రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్లు చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
అంతకముందు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్కు ఇదే చివరి గేమ్ కావడంతో సన్రైజర్స్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది.