ఆరంభంలోనే షాక్:
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే భువీ బౌలింగ్లో పార్థివ్ (0) డకౌటయ్యాడు. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాదిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (7 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్)ని ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. డివిలియర్స్ (1) మూడో ఓవర్లో భువికి చిక్కాడు. బెంగళూరు 20 పరుగులకే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న హెట్మయర్, గుర్కీరత్ సింగ్:
ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్మయర్ (75; 47 బంతుల్లో 4×4, 6×6), గుర్కీరత్ సింగ్ (65; 48 బంతుల్లో 8×4, 1×6) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరు వేగం పెంచారు. మరోవైపు హైదరాబాద్ ఫీల్డర్లు చేతికొచ్చిన క్యాచ్ల్ని వదిలేశారు. ఇది వాళ్ళు సద్వినియోగం చేసుకుని మరింత రెచ్చిపోయారు. ఇక 24 బంతుల్లో 30 పరుగులే కావాలి. ఈ దశలో హెట్మైర్, గురుకీరత్, సుందర్ (0) ఔటవ్వడంతో హైదరాబాద్ ఆటగాళ్లలో ఆశలు చిగురించాయి. కానీ చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా.. ఉమేశ్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరుకు విజయాన్ని అందించాడు.
విలియమ్సన్ దూకుడు:
మొదటగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సాహా (20), గప్తిల్ (30) మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో సన్రైజర్స్ తడబడింది. గప్తిల్, పాండే (9)లను సుందర్ (3/24) ఒక్క పరుగు వ్యవధిలో ఔట్ చేయడంతో.. 62పరుగులకే సన్రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్ శంకర్ (27)తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. మూడు సిక్సర్లు బాది ఊపుమీద కనిపించిన శంకర్ ఔటైనప్పటికీ విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. మరోవైపు యూసుఫ్ పఠాన్ (3), నబి (4), రషీద్ ఖాన్ (1)లు త్వరగానే పెవిలియన్ చేరారు. విలియమ్సన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు బాదడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. హెట్మైర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.