
హైదరాబాద్: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జోస్ బట్లర్ 43 బంతుల్లో 87 (8 ఫోర్లు, 7 సిక్సర్లు) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే 21 బంతుల్లో 37(6 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి బట్లర్ తొలి వికెట్కు 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే(37) సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ 25 బంతుల్లో31( 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫరవాలేదనిపించాడు.
ఆ తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో శ్రేయస్ గోపాల్(13 నాటౌట్) ఆఖరి ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టడంతో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
వాంఖడెలో రాజస్థాన్ విజయ లక్ష్యం 188
అంతకముందు ఓపెనర్లు క్వింటన్ డీకాక్ 52 బంతుల్లో 81(6 ఫోర్లు, 4 సిక్సులు), రోహిత్ శర్మ 32 బంతుల్లో 47 (6 ఫోర్లు, సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్కి 188 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ(47) బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(16), కీరణ్పోలార్డ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
గత మ్యాచ్లో దూకుడుగా ఆడిన కీరన్ పొలార్డ్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ఆర్చర్ బౌలింగ్లో శ్రేయస్ గోపాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, డీకాక్ మాత్రం నిలకడగా ఆడుతూ 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
చివర్లో హార్ధిక్ పాండ్యా 11 బంతుల్లో 28(ఫోర్, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, కులకర్ణి, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
అంతకముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్కి దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఈ మ్యాచ్లో చోటు దక్కించుకున్నాడు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ స్థానంలో లివింగ్ స్టోన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... కృష్ణప్ప గౌతం కూడా తిరిగి జట్టులో చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓటమిపాలై పాయింట్ల పట్టకలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కి ముంబై ఇండియన్స్కు మద్దతు తెలిపేందుకు గాను 21వేల మంది చిన్నారులు స్టేడియానికి వచ్చారు. ప్రతి సీజన్లోనూ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఐపీఎల్లో సొంతగడ్డపై జరిగే ఓ మ్యాచ్కి చిన్నారులతో కలిసి స్టేడియానికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కి ముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు.
"చదువు.. క్రీడలు రెండింటి మధ్య పార్టనర్షిప్ పిల్లలను సక్సెస్ఫుల్ ఫ్యూచర్ వైపుకు నడిపిస్తాయి. ఈఎస్ఏ ముంబై ఇండియన్స్ను స్పాన్సర్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 13న జరిగే మ్యాచ్లో 21వేల మంది చిన్నారులు వస్తున్నారు. వాళ్ల చిరునవ్వులను చూసేందుకు ఎదురుచూస్తున్నా" అని రోహిత్ ట్వీట్ చేశాడు.