

హైదరాబాద్: చివరివరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ముంబై జట్టులో కెప్టెన్ కీరన్ పొలార్డ్ 31 బంతుల్లో 83 (3 ఫోర్లు, 10 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి బంతికి జోసెఫ్(15 నాటౌట్) రెండు పరుగులు చేయడంతో ముంబై విజయం సాధించింది. తాజా విజయం ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో రెండోది కావడం విశేషం.
కేఎల్ రాహుల్ సెంచరీ, ముంబై విజయ లక్ష్యం 198
ఓపెనర్లు కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 100 నాటౌట్ (6 ఫోర్లు, 6 సిక్సులు), క్రిస్ గేల్ 36 బంతుల్లో 63 (3 ఫోర్లు, 7 సిక్సులు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్కు 198 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. ఆరంభం నుంచీ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగగా... కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే, ఇన్నింగ్స్ 13వ ఓవర్లో క్రిస్గేల్ ఔటయ్యాక పంజాబ్ వరుసగా వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(7), కరుణ్ నాయర్(5), శామ్ కర్రన్(8)లు తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. అయినా సరే కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీని సాధించాడు. హర్దిక్ పాండ్యా వేసిన 19 ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది 25 పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీ నమోదు చేశాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, బెహ్రాన్డార్ఫ్, బుమ్రాలు చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
అంతకముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కి దూరమయ్యాడు. అతడి స్థానంలో కెప్టెన్గా వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
ఈ క్రమంలో కీరన్ పొలార్డ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే కీరన్ పొలార్డ్ తొలిసారి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తరుపున యువ ఆటగాడు సిద్ధార్ద్ లాడ్ అరంగేట్రం చేస్తున్నాడు. మంగళవారం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్న క్రమంలో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే.
ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో డైవ్ చేయగా అతని కుడి తొడ కండరాలకు గాయమైంది. మరోవైపు పంజాబ్ కెప్టెన్ అశ్విన్ కూడా తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. మయాంక్ అగర్వాల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో కరుణ్ నాయర్, విజియిన్లకు తుది జట్టులో చోటు కల్పించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన పంజాబ్ నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అయితే, సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో ఈ మ్యాచ్లో ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వెస్టిండిస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ (12/6) ఆరంభ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మరోవైపు పంజాబ్ విషయానికి వస్తే మొహాలి వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.