ఐదు ఓవర్లకు కుదింపు:
మంగళవారం రాత్రి 7:30 గంటలకు టాస్ నెగ్గిన రాజస్తాన్ కెప్టెన్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం స్టేడియంలో వర్షం కురిసింది. వర్షం పూర్తిగా తగ్గాక అంపైర్లు పలుమార్లు పిచ్ను, ఔట్ ఫీల్డ్ను పరిశీలించారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించారు.
గోపాల్ హ్యాట్రిక్:
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (25; 7 బంతుల్లో 1×4, 3×6) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఏబీ డివిలియర్స్ (10; 4 బంతుల్లో 2×4) ఆకట్టుకున్నాడు. ఈ జంట తొలి ఓవర్లోనే 23 పరుగులు చేశారు. రెండో ఓవర్ వేసిన రాజస్థాన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. చివరి మూడు బంతుల్లో కోహ్లీ, డివిలియర్స్, మార్కస్ స్టొయినిస్ (0)లను ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో త్వరత్వరగా పెవిలియన్ చేరారు.
మళ్లీ వర్షం.. మ్యాచ్ రద్దు:
అనంతరం 63 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మళ్లీ పడడంతో.. అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. రాజస్థాన్ ఓపెనర్ సంజు శాంసన్ (28: 13 బంతుల్లో 2×4, 3×6) చెలరేగాడు. మరో ఓపెనర్ లివింగ్ స్టన్ (11 నాటౌట్: 7 బంతుల్లో 1×4, 1×6) రాణించాడు. మ్యాచ్ మొత్తం జరిగిగుంటే రాజస్థాన్కు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలను వర్షం దూరం చేసినట్టే.