ఐపీఎల్ 2019 వేలం తేదీ ఖరారు: డిసెంబర్లో ఆ రెండు రోజుల్లోనే!


హైదరాబాద్: వచ్చే ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత్లో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ కాస్త ముందుకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్ను మార్చి 29 నుంచి మే 19 మధ్య నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అంతకుముందే వచ్చే సీజన్ కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది.
ఇప్పటివరకు ఐపీఎల్ వేలాన్ని బెంగళూరులో నిర్వహించగా... ఐపీఎల్ 12వ సీజన్ కోసం ఐపీఎల్ వేలాన్ని జైపూర్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేలాన్ని డిసెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించాలని బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మిర్రర్లో ఓ వార్తా కథనం వచ్చింది.

ఇప్పటి నుంచే తమ కసరత్తులు ముమ్మరం
వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వేదిక విషయంలో క్లారిటీ
"ఐపీఎల్ వేలానికి సంబంధించి వేదిక విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దీనిని బట్టి, ఆటగాళ్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నాం" అని ఓ ప్రాంఛైజీకి చెందిన యజమాని స్పోర్ట్స్స్టార్కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. వేలానికి ముందే వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.

ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటారనే
మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు సంబంధించిన ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్ సీజన్లో ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటారనే విషయం వేలానికి ముందే స్పష్టత రానుందని ఆయన తెలిపారు. వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్ 2019 సీజన్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు చెందిన ఆటగాళ్లు పాల్గొనే విషయమై డైలమా నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్, వరల్డ్ కప్ల మధ్య చాలా తక్కువ విరామ సమయం
ఐపీఎల్, వరల్డ్ కప్ల మధ్య చాలా తక్కువ విరామం ఉండటంతో ఐపీఎల్లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కంటే దేశానికే తొలి ప్రాధాన్యమివ్వాలని సీఏ అధికారులు పేర్కొన్నారు.

టోర్నీనుంచి వైదొలిగి స్వదేశానికి పయనం కావాల్సిందే
ఐపీఎల్, వరల్డ్ కప్కు మధ్య తక్కువ సమయం ఉండటంతో... వరల్డ్ కప్కు ఎంపికైన 15మంది ఆసీస్ క్రికెటర్లు ఆ సమయంలో ఐపీఎల్లో ఆడుతుంటే అప్పటికప్పుడే టోర్నీనుంచి వైదొలిగి స్వదేశానికి పయనం కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఐపీఎల్లో ఆడాలనుకునే ఆసీస్ క్రికెటర్లు ముందుగా సీఏ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications