
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో అలరించడానికి మరో విండిస్ క్రికెటర్ సిద్ధమయ్యాడు. ఈ సీజన్లో వెస్టిండిస్కు చెందిన పేస్ బౌలర్ అల్జర్రీ జోసెఫ్ ముంబై ఇండియన్స్ జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే అతడు ముంబై జట్టులో చేరినట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గాయం కారణంగా ముంబై ఇండియన్స్కు దూరమైన న్యూజిలాండ్ క్రికెటర్ ఆడమ్ మిల్నే స్థానంలో అల్జర్రీ జోసెఫ్ను తీసుకున్నారు. ఈ మేరకు జోసెఫ్తో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒప్పందం కుదుర్చకుంది. ఆడమ్ మిల్నే గాయంతో స్వదేశానికి పయనమైన నేపథ్యంలో అతని స్థానంలో జోసెఫ్ ఆడేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతిచ్చింది.
దీంతో ఐపీఎల్ 2019 సీజన్లో మిల్నే స్థానాన్ని జోసెఫ్ భర్తీ చేస్తాడని ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్ తరఫున తొమ్మిది టెస్టులు, 16 వన్డేలు ఆడిన జోసెఫ్ ఇప్పటివరకు 25 టెస్టు వికెట్లు, 24 వన్డే వికెట్లను సాధించాడు. వెస్టిండిస్ నుంచి ఇప్పటికే క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రేవో, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. భారీ అంచనాలతో ఐపీఎల్ 12వ సీజన్లో బరిలోకి దిగిన ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూశాయి.
ఈ మ్యాచ్లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఇరు జట్ల కెప్టెన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడేది ప్రశ్నార్థకంగా మారింది. బుమ్రా స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది. మలింగకు ఐపీఎల్లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే ముంబై జట్టులో చేరాడు.