హైదరాబాద్: కేరళ ఫాస్ట్ బౌలర్ కేఎం ఆసిఫ్ ఐపీఎల్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడంతో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ జట్లలో సీఎస్కే జట్టుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పైగా ఆ జట్టు కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ.
ఇలా అతను సీఎస్కేను కొనియాడుతూ.. తనకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో ఆడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేదని తెలిపాడు. దాంతో పాటు అతని ఆల్ రౌండ్ ప్రదర్శనను గుర్తించి తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రోత్సహించినందుకు ఎమ్మారెఫ్ ఫేస్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇంకా తన లాగా చాలామంది ఇలా ప్రయోజనం పొందుతున్నారంటూ పేర్కొన్నాడు.
బుధవారం ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వ్యాఖ్యానించాడు. 'నాకు ఎప్పటి నుంచో ధోనీ కెప్టెన్సీలో ఆడాలని ఆశగా ఉంది. నేనింత వరకు వచ్చానంటే అది ఎమ్మారెఫ్ దయతోనే. అందుకు నేను ఎమ్మారెఫ్కు చాలా రుణపడి ఉంటాను. ఏడాది నుంచి ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాను. ఇప్పుడు మెంటల్గా, ఫిజికల్గా ఆడేందుకు శిక్షణ పొందాను' అని వివరించాడు.
తాను చెన్నై జట్టులో ఆడటమే కాదు. తమిళ సినిమాలు కూడా బాగా చూస్తాడట. స్వతహాగా చియాన్ విక్రమ్కు వీరాభిమాని అని పేర్కొన్నాడు. క్రికెట్లో మాత్రం వీరేందర్ సెహ్వాగ్కు అభిమానిని అని వ్యాఖ్యానించాడు. అతనిని చెన్నై జట్టు రూ. 40లక్షలకు కొనుగోలు చేయకముందు ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ట్రైల్స్ కూడా వేశాయంట.