రాజస్థాన్ రాయల్స్పై మూడో సెంచరీ
గత ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరుపున రెండు సెంచరీలు సాధించిన షేన్ వాట్సన్... అదే రాజస్థాన్ రాయల్స్పై మూడో సెంచరీని సాధించాడు. చెన్నై ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే షేన్ వాట్సన్ దూకుడుగా ఆడాడు. స్టువర్ట్ బిన్నీ వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన వాట్సన్.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
రాహుల్ త్రిపాఠి ఇచ్చిన లైఫ్తో చెలరేగాడు
షేన్ వాట్సన్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న రాహుల్ త్రిఫాఠి జారవిడిచాడు. ఆ తర్వాత ఓవర్లోనూ వాట్సన్ క్యాచ్ని మరోసారి త్రిపాఠి జారవిడచడంతో వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో చెలరేగాడు. వాట్సన్ను ఔట్ చేసేందుకు గాను రహానే వరుసగా బౌలర్లను మార్చిన ప్రయోజనం లేకపోయింది.
రాజస్థాన్ విజయ లక్ష్యం 205 పరుగులు
51 బంతుల్లో సెంచరీ సాధించిన వాట్సన్ చివర్లో బెన్ లాఫ్లిన్ బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
18.3 ఓవర్లలో 140 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్
అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(45) రాణించగా, జాస్ బట్లర్(22) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్, తాహీర్లు తలో వికెట్ తీశారు.