
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2018 సీజన్ కోసం షేన్ వార్న్ను రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ టీమ్ మెంటార్గా నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రాంఛైజీ తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది.

2008 నుంచి 2011 వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో షేన్ వార్న్ ప్రధాన ఆటగాడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. అంతేకాదు కెప్టెన్గా ఐపీఎల్ తొలి ఎడిషన్లోనే రాజస్థాన్ను విజేతగా నిలిపాడు. మళ్లీ తాను ఐపీఎల్కు వస్తున్నట్లు గత వారంలో షేన్ వార్న్ ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం షేన్ వార్న్ని మెంటార్గా నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా షేన్ వార్న్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని పోస్టు చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన వార్న్ కెప్టెన్తో పాటు కోచ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 2008 నుంచి 2011 వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడిన వార్న్ మొత్తం 52 మ్యాచుల్లో 56 వికెట్లు తీసుకున్నాడు. 2011లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వార్న్.. తర్వాత ఆటకు గుడ్బై చెప్పాడు.
రెండేళ్ల నిషేధం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టబోతోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్గా ఎంపికైన షేన్ వార్న్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. రాయల్స్ జట్టు కెప్టెన్గా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. కాగా, వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బెన్ స్టోక్స్, రహానే, జయదేవ్ ఉనాద్కక్త్ లాంటి ఆటగాళ్లను కోనుగోలు చేసింది.