
హైదరాబాద్: ఐపీఎల్లో రెండో రోజు బెంగుళూరు, కోల్కత్తా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నైట్రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ను నేరుగా చూసేందుకు ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ఖాన్ తరలివచ్చాడు. తనతో పాటు అతని కూతురు కూడా మైదానానికి వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు.
ఆదివారం రాత్రి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో షారూఖ్ కూతురు సుహానా స్పెషల్ అట్రాక్షన్ అయింది. గతంలో ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చి షారుక్ చిన్న కుమారుడు అబ్రామ్ మైదానంలో సందడి చేశాడు. ఈసారి బుడ్డోడు అబ్రామ్, సుహానాఖాన్లతో తండ్రి షారుక్ స్డేడియానికి వచ్చి మ్యాచ్ ఆస్వాదించారు.
బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న ఊహాగానాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుహానా రాక మరింత క్రేజ్ తెచ్చింది. తొలుత కేకేఆర్ ఆటగాళ్లు బౌలింగ్లో వికెట్లు తీస్తుంటే సంతోషించిన సుహానా.. తండ్రి షారుఖ్తో కలిసి తమ జట్టుకు మద్దతు తెలిపింది. ఆపై ఛేజింగ్ సమయంలో తమ బ్యాట్స్మెన్ ఔటయిన సందర్భాల్లో ఆశ్చర్య పోతున్నట్లు, విచారం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించి తన హావభావాలతో ఆకట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన సుహానా తండ్రి షారుక్తో కలిసి వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను ఆస్వాదించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న షారూఖ్ అభిమానులు.. త్వరలోనే సుహానాను వెండితెరపై చూస్తామంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.