ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా
'సాధారణంగా నేను మిడిలార్డర్లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను టాపార్డర్లో దించాలన్నది కోచ్ షేన్ వార్న్ నిర్ణయం. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది' అని బట్లర్ తెలిపాడు.
ఐపీఎల్ కెరీర్లో ఇదే నా బెస్ట్ ఇన్నింగ్స్
ఐపీఎల్ కెరీర్లో ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్ ఇన్నింగ్స్. ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్ కూడా తనతో మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఆమె ముందు ఈ ఇన్నింగ్స్ ఆడటం, గెలవడం మరిచిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ ఐపీఎల్. ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది' అని అన్నాడు.
4 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం
శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (95 నాటౌట్; 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆరో స్థానానికి ఎగబాకిన రాజస్థాన్
మరోవైపు సంజూ శాంసన్(21), స్టువర్ట్ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. చెన్నై బౌలర్లలో డేవిడ్ విల్లీ, భజ్జీ, జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.