ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా డీఆర్ఎస్
ఇప్పటివరకు మొత్తం 11 ఐపీఎల్ సీజన్లు ముగిశాయి. అయితే, తొలిసారిగా ఈ సీజన్లో డీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐపీఎల్లో డీఆర్ఎస్ విధానం పెట్టడంపై తొలుత మిశ్రమ స్పందనే వచ్చింది. అయితే, మ్యాచ్లు ప్రారంభం అయిన తర్వాత ఈ డీఆర్ఎస్ను అన్ని జట్లు ఉపయోగించుకోవడం విశేషం.
మ్యాచ్ సమయ వేళలు మార్చాలంటూ పెద్దఎత్తున చర్చ
ఐపీఎల్ 2018వ సీజన్ వేలం ముగిసిన తర్వాత మీడియా హక్కులను దక్కించుకున్న స్టార్ నెట్వర్క్ మ్యాచ్ సమయాల్లో మార్పులకు సూచించింది. తొలి మ్యాచ్ని మధ్యాహ్నం 3గంటలకు, రెండో మ్యాచ్ని రాత్రి 7గంటలకే ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డుని కోరింది. దీనిపై అంతటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందుకు ఫ్రాంఛైజీలు ఒప్పుకోకపోవడంతో మ్యాచ్ సమయ వేళలను యథాతథంగా కొనసాగించారు. అయితే, చివర్లో రాత్రి మ్యాచ్లు చూసే వీక్షకులు సంఖ్య తగ్గిపోవడం, స్టేడియం నుంచి ప్రేక్షకులు ఇళ్లకు వెళ్లటంలో ఇబ్బంది పడుతుండటంతో ప్లేఆఫ్ మ్యాచ్లను ఒక గంట ముందుకు జరిపి రాత్రి 7గంటలకే నిర్వహించారు.
ఐపీఎల్పై బాల్ టాంపరింగ్ వివాదం ప్రభావం
ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో బాల్టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీని ప్రభావం ఐపీఎల్పైనా పడింది. ఫలితంగా రాజస్థాన్, సన్రైజర్స్ కొత్త కెప్టెన్లను వెతుక్కోవాల్సి వచ్చింది. వీరిద్దరి స్థానంలో రహానె, కేన్ విలియమ్సన్ జట్టు సారథ్య బాధ్యతలను అందుకుని ముందుకు నడిపించారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదన్న రీతిలో విలియమ్సన్ నిరూపించాడు. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా అతను అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మాత్రం స్మిత్ లేని లోటు కనిపించింది.
చెన్నై సూపర్ కింగ్స్ వేదిక మార్పు
రెండేళ్ల నిషేధం ముగించుకుని ఈ సీజన్లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్కింగ్స్ లీగ్ దశలోనే సొంతగడ్డకు దూరంగా ఆడాల్సి వచ్చింది. కావేరి జలాల వివాదం కారణంగా చెన్నైలో జరగాల్సిన మ్యాచ్లన్నీ పుణెకు తరలించాల్సి వచ్చింది. ఫలితంగా సొంత అభిమానుల మధ్య ఆడలేకపోవడం చెన్నై జట్టుకు ఇబ్బందిగా మారింది. అయితే అభిమానులు మాత్రం ప్రత్యేకంగా పుణెలో జరిగిన తొలి మ్యాచ్ కోసం 'విజిల్పోడు ఎక్స్ప్రెస్' పేరుతో రైలు కట్టుకొని మరీ వచ్చి చెన్నై ఆటగాళ్లకు మద్దతు పలకడం ఈ ఐపీఎల్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.
గంభీర్ రాజీనామా
ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన గౌతమ్ గంభీర్ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందు సీజన్లలో కోల్కతా ఛాంపియన్గా నిలిపిన గంభీర్ అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో అందరినీ ఆశ్చర్య పరిచింది. తర్వాతి మ్యాచ్లలోనూ అతనిని తుదిజట్టులోకి తీసుకోలేదు.
పంజాబ్ మెంటార్ సెహ్వాగ్పై ప్రీతిజింటా కోపం
ఈ సీజన్లో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో ఇదొకటి. టోర్నీలో భాగంగా పంజాబ్.. రాజస్థాన్తో జరిగిన ఓ మ్యాచ్లో 15పరుగుల తేడాతో ఓడింది. 158 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పంజాబ్ విఫలం కావడంతో ప్రీతి మ్యాచ్ అనంతరం జట్టు మెంటార్ సెహ్వాగ్ను ప్రశ్నించిందట. అంతేకాదు కరుణ్ నాయర్, మనోజ్ తివారీని కాదని అశ్విన్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపడంపై సెహ్వాగ్పై.. ప్రీతి ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై సెహ్వాగ్ స్పందించలేదు. ప్రీతిజింటా మాత్రం ట్విట్టర్ వేదికగా అలాంటిది ఏమీ జరగలేదని వివరణ ఇచ్చుకుంది.
బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్
గతేడాది ఐపీఎల్లో పాపులర్ అయిన బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్ ఛాలెంజ్ను ఈసీజన్లో కూడా కొనసాగించారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్వీకరించి గడ్డంలో కొత్త లుక్లో కనిపిస్తున్న వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ను రవీంద్ర జడేజా, కేన్ విలియమ్సన్ స్వీకరించారు.
గులాబీ రంగు జెర్సీలో రాజస్థాన్ రాయల్స్
క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు రాజస్థాన్ ఆటగాళ్లు గులాబీ రంగు జెర్సీలు ధరించి లీగ్ దశలో చెన్నైతో ఆడిన మ్యాచ్లో బరిలోకి దిగారు. ‘క్యాన్సర్ రహిత సమాజం దిశగా ఇదో ముందడుగు. ప్రజల్లో వీలైనంత అవగాహన పెంచేందుకే ఈ ప్రయత్నం అని' ఆ జట్టు కెప్టెన్ రహానె చెప్పాడు.
2019 ఐపీఎల్ దుబాయ్లో
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ను దుబాయిలో నిర్వహించే అవకాశం ఉంది. 2019లో ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగాల్సివుంది. అదే సమయంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. 'ఐపీఎల్ జరగాల్సిన సమయంలోనే ఎన్నికలు వస్తే.. అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటాం. టోర్నీని తరిలించాల్సి వస్తే వేదిక యూఏఈ అయ్యే అవకాశాలే ఎక్కువ' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాబోయే రోజుల్లో మహిళల ఐపీఎల్
రాబోయే రోజుల్లో మహిళల ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచనతో ముంబైలోని వాంఖడె స్టేడియంలో తొలి క్వాలిఫయిర్కు ముందు బీసీసీఐ ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ని నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లో భారత, విదేశీ మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో రెండు జట్లుగా విడగొట్టి ఓ టీ20మ్యాచ్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.
త్రీ రన్స్ ఛాలెంజ్
'బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్' మాదిరి ఈ సీజన్ చివర్లో విరాట్ కోహ్లీ త్రీ రన్స్ ఛాలెంజ్కి శ్రీకారం చుట్టాడు. ‘త్రీ రన్స్' ఛాలెంజ్ ఏంటంటే.. వికెట్ల మధ్య వేగంగా మూడు పరుగులు సాధించడం. ఎవరైతే తక్కువ సమయాన్ని నమోదు చేస్తారో వారే విజేతలు. ఈ ఛాలెంజ్లో పాల్గొనాలని కోహ్లీ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్కు సవాల్ విసిరాడు. దీంతో రషీద్ ఖాన్ ఈ త్రీ రన్స్ సవాల్ని స్వకీరించాడు. రషీద్ఖాన్ 10.50 సెకండ్లకు మూడు పరుగులు పూర్తి చేశాడు. ఇప్పటి వరకు ఈ సవాలులో పాల్గొన్న వారిలో కోహ్లీనే ముందున్నాడు. కోహ్లీ కేవలం 8.90 సెకన్లలోనే మూడు పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని-బ్రావోలు కలిసి ఈ త్రీ రన్స్ ఛాలెంజ్ని స్వీకరించారు. ఈ ఛాలెంజ్లో ధోని విజయం సాధించాడు.