
హైదరాబాద్: బాల్ టాంపరింగ్కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 11వ సీజన్కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో కెప్టెన్గా అజ్యింకె రహానేను నియమించిన రాజస్థాన్ యాజమాన్యం, ఆటగాడిగా స్మిత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్లో స్మిత్ స్థానాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్తో భర్తీ చేసేందుకు ఆసక్తి చూపుతోందంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐకి రాజస్థాన్ రాయల్స్ ఓ లేఖ రాసింది. ఆ లేఖలో క్లాసెన్ను తీసుకునేందుకు గాను అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరింది.
స్టీవ్ స్మిత్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లాలను వెనక్కి నెట్టి మరీ క్లాసెన్ రేసులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత రూట్, ఆమ్లాల పేర్లను పరిశీలించిన రాజస్థాన్ యాజమాన్యం చివరకు క్లాసెన్ వైపే మొగ్గు చూపడం విశేషం.
అయితే ఇందుకు కారణం లేకపోలేదు. క్లాసెన్ అటు బ్యాట్స్మెన్గా రాణించడమే కాదు... వికెట్ కీపర్గా కూడా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్లాసెన్వైపు మొగ్గుచూపినట్లు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ బరుచా తెలిపారు. ఐపీఎల్లో స్పిన్నర్ల పాత్ర అధికంగా ఉంటుందని, దానిని దృష్టిలో పెట్టుకుని స్సిన్ను బాగా ఆడే క్లాసెన్ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవలే కోహ్లీసేన సఫారీ పర్యటనలో భారత మణికట్టు స్పిన్నర్లను హెన్రిచ్ క్లాసెన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సంజూ శాంసన్, జోస్ బట్లర్ లాగే బ్యాటింగ్లో కూడా క్లాసెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ ఆడటంపై క్లాసెన్ను సంప్రదించగా అతడు ఎగిరి గంతేశాడు. ఐపీఎల్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.