హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిస్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి ఐపీఎల్ ప్రాంఛైజీలు.
ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాని ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి. జాబితాలోని పది మంది ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఈ జాబితాలో హసీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), లూక్ రోంచి (న్యూజిలాండ్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కుశాల్ పెరీరా (శ్రీలంక), హెన్రిక్యూస్ (ఆస్ట్రేలియా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్), షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లాండ్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), జానీ బారిస్టో (ఇంగ్లాండ్) ఉన్నారు.
ఈ పది మందిలో ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ 11వ సీజన్లో ఆడనున్నారు. కేప్టౌన్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడినందుకు గాను స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్మిత్ తప్పుకోగా అతడి స్థానంలో అజింక్యె రహానేకు రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ మేరకు గురువారం యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది.
Kane Williamson has been appointed as captain of SunRisers Hyderabad for IPL 2018. pic.twitter.com/b5SMK8086U
— SunRisers Hyderabad (@SunRisers) March 29, 2018
కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలియమ్సన్ తెలిపాడు. మరోవైపు జట్టులో వార్నర్ స్ధానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను జట్టులోకి తీసుకోవాలని సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొలంబోలోని బీసీసీ రిపోర్టర్ అజ్జామ్ అమీన్ ట్వీట్ చేశాడు.
IPL team SunRisers Hyderabad has approached Kusal Janith Perera as a possible replacement for Banned David Warner, deal yet to be finalised
— Azzam Ameen (@AzzamAmeen) March 28, 2018