హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై నితీశ్ రాణా విరుచుకుపడ్డాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అలా బౌండరీలు చేయడానికి కారణం వివరించాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ గేమ్ ప్లాన్ని ఫీల్డర్ల మార్పు ఆధారంగా కనిపెట్టగలిగానని కోల్కతా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ నితీశ్ రానా వెల్లడించాడు.
నితీశ్ రానా 35 బంతుల్లో 5 ఫోర్లతో, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా.. పట్టుదలతో బ్యాటింగ్ చేసిన రాణా.. డీప్ పాయింట్, కవర్స్ దిశగా చూడచక్కని బౌండరీలతో అందర్నీ ఆకర్షించాడు. అతడి జోరుకి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వరుసగా బౌలర్లు, ఫీల్డర్లు మార్చినా.. 19వ ఓవర్ వరకూ ఫలితం రాబట్టలేకపోయాడు.
ఆఫ్ సైడ్ ఎక్కువ మంది ఫీల్డర్లని గంభీర్ ఉంచినా.. వరుసగా బౌండరీలు కొట్టగలగడం ఎలా సాధ్యమైందని అడిగిన ప్రశ్నకు నితీశ్ రాణా వివరణ ఇచ్చాడు. నాని 'ఫీల్డింగ్ సెటప్ని బట్టి బౌలర్ ఏ బంతిని వేయబోతున్నాడో ముందుగానే అంచనా వేయగలిగాను. ఈ సీజన్లో నాపై ఏ జట్టు కూడా అవుట్ సైడ్ ఆఫ్ బంతుల్ని వరుసగా విసిరి పరీక్షించలేదు. కానీ.. ఢిల్లీ బౌలర్లు సంధించారు. దీంతో.. వారి వ్యూహం నాకు అర్థమై స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించగలిగాను'.అని వివరించాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'కెరీర్లో తొలిసారి కోల్కతా జట్టుకి ఆడుతున్నాను. దీనికి తోడు తొలి మూడు మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యా. దీంతో.. ఈ మ్యాచ్లో మెరుగైన స్కోరు చేయాలని పట్టుదలతో ఆడాను. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ఓడిపోవడం కూడా.. ఈ పట్టుదలకి ఓ కారణం' అని నితీశ్ రానా వెల్లడించాడు. చేధనలో దిగిన ఢిల్లీ జట్టు 201 టార్గెట్ను సాధించలేకపోవడంతో 71 పరుగుల తేడాతో కోల్కతా విజయం సాధించింది.