
హైదరాబాద్: అంతా బాగానే ఉంది కానీ, మ్యాచ్ ఆఖర్లో తమ జట్టు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మూలంగానే సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిందని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అన్నాడు. 'మా బ్యాట్స్మెన్ మెరుగ్గానే ఆడారు. అయితే ఇంకాస్త కష్టపడి ఉంటే జట్టు స్కోరు 160, 170 పరుగులకు చేరుకునేది. అదే జరిగి ఉంటే కచ్చితంగా మాకున్న బలమైన బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం సన్రైజర్స్కు కష్టతరమయ్యేదని' ఈ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
గురువారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 148పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ చివరి బంతి వరకూ పోరాడి ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్రైజర్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది.
అయితే చివర్లో కొన్ని అనవసరపు నిర్ణయాల మూలంగానే ముంబయి ఓడిపోయినట్లు బాండ్ తెలిపాడు. 'మరో వికెట్ పడగొట్టి ఉంటే విజయం సొంతమయ్యేది. మ్యాచ్ను కాపాడుకోవడానికి మా వాళ్లు అద్భుతంగా పోరాడారు. టీ20 ఫార్మాట్లో విజయం చేతులు మారడం సహజం. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో సైతం అకస్మాత్తుగా మార్పులు జరగొచ్చు. గురువారం జరిగిన మ్యాచ్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే మ్యాచ్ను గెలిపించలేరు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని చివరి వరకూ పోరాడాలని' ఈ న్యూజిలాండ్ మాజీ పేసర్ అన్నాడు.
మ్యాచ్ గెలిచిందిలా:
అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయం సాధించింది. గురువారం ఉత్కంఠభరిత పోరులో సన్రైజర్స్ ఒక వికెట్ తేడాతో తేడాతో ముంబైపై గెలుపొందింది. మొదట ముంబై.. 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ (45; 28 బంతుల్లో 8×4) మరోసారి సత్తాచాటగా.. దీపక్ హుడా (32 నాటౌట్; 25 బంతుల్లో 1×4, 1×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు.