హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తుది జట్టుని మంచి కాంబినేషన్తో ఎంచుకుంటున్నాడని భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ జాతీయ ఛానెల్కు రాసిన వ్యాసంలో చెన్నై ఆటతీరు.. ఆటగాళ్ల కూర్పుపై ప్రశంసలు కురిపించారు.
'రెండేళ్లు రేసులో లేకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ గతంలో మాదిరే ఇప్పుడూ స్థిరంగా రాణిస్తోంది. అందుకు సరైన జట్టును ఎంచుకోవడం ముఖ్య కారణం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. తుది జట్టుని మంచి కాంబినేషన్తో ఎంచుకుంటున్నాడు' అని అన్నాడు.
'ముఖ్యంగా జట్టులో ప్రతీ ఒక్కరికి తమ కర్తవ్యం ఏమిటో స్పష్టం చేసి.. జట్టు త్వరగా కుదురుకునేలా చేశాడు. యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, సీనియర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడ్ని టోర్నీలో ధోనీ ఇప్పటి వరకు వినియోగించుకున్న తీరు.. మిగిలిన జట్ల కెప్టెన్లకి ఓ పాఠంగా చెప్పవచ్చు' అని అన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'ప్రధాన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయంతో జట్టుకి దూరమైనా.. ఆ ప్రభావం ఇసుమంతమైనా జట్టుపై పడకపోవడం ధోనీ ముందుచూపునకి నిదర్శనం. శుక్రవారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్పై చెన్నై ఎప్పట్లాగే ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మరోవైపు రాజస్థాన్కు ప్రతీ మ్యాచ్ నాకౌట్ లాంటిందే. ఓడితే కొత్తగా కోల్పోయేది ఏమీ ఉండదు' అని అన్నాడు.
'కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. సొంతగడ్డపై రాజస్థాన్ ఎప్పుడూ బలమైన జట్టే. గత రెండేళ్లుగా నిషేధం కారణంగా ఐపీఎల్కి దూరమైన చెన్నై జట్టు.. ఇలా పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఘనత అంతా ధోనీదే' అని క్రిస్ శ్రీకాంత్ కొనియాడారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్ల్లో గెలుపొంది ప్లేఆఫ్కి అడుగు దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలుస్తుంది. సన్రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే.