
హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టులో మార్పు చోటు చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్కు వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆసీస్ పేసర్ జాసన్ బెహ్రెన్డార్ఫ్ హాజరు కాలేకపోతున్నాడు. పూర్తి లీగ్కు అందుబాటులో లేకపోవడంపై అతని స్థానంలో కివీస్ పేసర్ మిచెల్ మెక్లీనగన్ను తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ దీనికి ఆమోద ముద్ర వేసింది.
ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో బెహ్రెన్డార్ఫ్ను ముంబై జట్టు కోల్కత్తా నైట్రైడర్స్తో పోటీపడి కోటిన్నరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెన్నునొప్పితో అతను లీగ్ మొత్తానికే దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గత మూడు సీజన్లు కూడా మెక్లీనగన్ ముంబై ఇండియన్స్కే ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఈసారి వేలంలో అతన్ని ఎవరూ తీసుకోలేదు. అయితే ఇప్పుడు కోటి రూపాయల ఒప్పందంతో మళ్లీ ముంబై జట్టులోకి వచ్చాడు.
గతేడాది ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్కు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు ముందే వెస్టరన్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్కు జరిగిన మ్యాచ్లో బెహండ్రాఫ్ వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ వేస్తూ 34వ ఓవర్లోనే వెనుదిరిగాడు. భారత్తో ఆడిన టీ20 మ్యాచ్లో ఈ ఫాస్ట్ బౌలర్ వేసిన 12 బంతుల్లోనే నాలుగు వికెట్లు తీసిన ఘనత ఉంది. గతేడాది అక్టోబరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ను సైతం అతను తీయగలిగాడు.
ఇదే విషయమై ముంబై జట్టు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. 'ఐపీఎల్ నిబంధనల ప్రకారం (ఆర్ఏపీపీ) రిజస్టర్డ్ అండ్ అవైలబుల్ ప్లేయర్ అనుసరించి మెక్క్లెనగన్ను ఎంచుకున్నాం. అదీ అతని ప్రారంభ ధర అయిన కోటి రూపాయలకు అతన్ని కొనుగోలు చేశాం' అని తెలిపారు.