
హైదరాబాద్: మయాంక్ మార్కండే... ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రధాన అస్త్రమని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో తన గూగ్లీలతో మూడు వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లలో చెన్నై కెప్టెన్ ధోని వికెట్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై జట్టు కొత్త టాలెంట్ని కనిపెట్టిందని ఆ టాలెంట్ ఎవరో కాదు మయాంక్ మార్కెండే అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ని సన్ రైజర్స్ హైదరాబాద్తో గురువారం ఆడనుంది.
ఇందులో భాగంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ 'ప్రాక్టీస్ సెషన్లో మార్కండే బౌలింగ్ను నేను ఎదుర్కొన్నాను. అతని బౌలింగ్లో ఓ ప్రత్యేక నైపుణ్యం ఉంది. మిడిల్ ఓవర్లలో మార్కండే పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టగలడు. తొలి మ్యాచ్లోనే అది నిరూపితమైంది' అని అన్నాడు.
'టోర్నీలో ముంబైకి అతను గొప్ప అస్త్రం. నేను, జట్టు కోచ్ మహేల జయవర్దనే మార్కండేకి మద్దతుగా నిలుస్తున్నాం. అతను కెరీర్లో మరింత అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తాం' అని రోహిత్ శర్మ వెల్లడించాడు. గత శనివారం వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మార్కండే 23 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో తొలుత అంబటి రాయుడు మార్కండే బౌలింగ్లో వికెట్ల ముందు ఎల్బీగా పెవిలియన్కు చేరగా, ఆ తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ ధోని సైతం అదే విధంగా ఔటయ్యాడు. ఇక, చివర్లో దీపక్ చాహర్ వికెట్ల ముందుకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు.