
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా తనను నియమించినందుకు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. కెప్టెన్గా ప్రకటించిన అనంతరం ట్విట్టర్లో వీడియో రూపంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అందులో సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తానని కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు.
కోల్కతా జట్టులో గత కొన్నేళ్లుగా ఆడుతోన్న రాబిన్ ఉతప్పతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దినేశ్ కార్తిక్ను కెప్టెన్గా ఎంపిక చేస్తూ కేకేఆర్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్పను వైస్ కెప్టెన్గా నియమించింది.
గతంలో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా పనిచేసిన గౌతం గంభీర్ను వదిలేసుకున్న ఆ జట్టు.. ఈ సీజన్లో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలనే దానిపై గత కొన్నిరోలుగా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆ జట్టులో కొనసాగుతున్న సీనియర్ బ్యాట్స్మన్ రాబిన్ ఉతప్ప, ఆసీస్ హిట్టర్ క్రిస్లిన్, విండీస్ ఆల్రౌండర్ సునీల్ నరైన్లో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
అయితే చివరకు దినేశ్ కార్తీక్నే సారథిగా నియమించడానికి కేకేఆర్ యాజమాన్యం మొగ్గుచూపింది. దీంతో ఊతప్పతో కలిసి పని చేస్తానని, ఇద్దరం పరస్పరం సహకరించుకుంటామని, గౌరవించుకుంటామని దినేశ్ కార్తీక్ అన్నాడు. 'రాబిన్ నేనూ సహకరించుకుంటాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరివీ భిన్న మనస్తత్వాలు. ఒకరికొకరం సహకరించుకుంటూ ఆడతాం' అని తెలిపాడు.
'అతిగా భావోద్వేగం చెందకుండా కారణాలను అనుసరించి నేను నిర్ణయాలు తీసుకుంటాను. మరోవైపు ఉతప్ప కాస్త భావోద్వేగం చెందుతుంటాడు. అభిరుచితో ఆడతాడు. అలా మేమిద్దరం మంచి జోడీ అవుతాం. జట్టు సమతూకంగా ఉంది. క్రిస్లిన్, రసెల్, స్టార్క్, నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు మా బృందంలో ఉన్నారు' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
'బ్యాటింగ్ చేస్తూ వికెట్ల వెనకాల ఉండి జట్టును నడిపిస్తాను. భారత జట్టులోనూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. మరోవైపు కేకేఆర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని రాబిన్ ఊతప్ప స్వాగతించాడు. కొత్త కెప్టెన్ దినేశ్ కార్తీక్కు అభినందనలు తెలియజేశాడు. అతడితో కలిసి పనిచేస్తానని అన్నాడు.