హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతుంతుంటే సొంత జట్టు అఫ్గానిస్తాన్కు ఆడుతున్నట్లే ఉందని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్ అభిప్రాయపడ్డాడు. శనివారం ఉప్పల్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన రషీద్ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా రషీద్ మీడియాతో ముచ్చటించాడు.
'నాబౌలింగ్ శైలే నా ప్రధాన బలం. దీన్ని పసిగట్టలేక బ్యాట్స్మన్ తడబాటు గురవుతున్నారు. దీనికి తోడు గుడ్ లెంగ్త్ బంతులు వేయడంతో నా పని సులువవుతోంది. సన్రైజర్స్కు ఆడుతుంటే సొంతజట్టు అఫ్గానిస్థాన్కు ఆడుతున్నట్లే అనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం అత్యద్భుతం. ఇంత తక్కువ వయస్సులో ఎక్కువ మ్యాచ్లాడి వాటిలోనూ అద్భుతంగా రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. రెండు మ్యాచ్లలో తడబడినా..తర్వాతి నుంచి కుదురుకొని ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అదే నా బలం. నా బౌలింగ్ శైలే మ్యాచ్లో రాణించేలా తోడ్పాటునందిస్తోంది' అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
ఇక ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన రషీద్ 12 వికెట్లతో అత్యధిక బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
పవర్ ప్లేలో ఇదే అత్యధికం..
సీజను ఆరంభం నుంచి బౌలింగ్ మీదనే ఆధారపడుతున్న సన్రైజర్స్కు..బ్యాటింగ్లో సరైన శుభారంభం లభించలేదు. అయితే ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. హేల్స్ మొదటి నుంచీ దూకుడుగా ఆడుతూ జట్టుకు తోడ్పాటునందించే ఇన్నింగ్ ఆడాడు. దీంతో సీజనులో శనివారం మ్యాచ్లో పవర్ప్లేలో సన్రైజర్స్ అత్యధిక పరుగులు రాబట్టింది. మొత్తం ఆరు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లలిద్దరూ కలిసి 61పరుగులు సాధించారు.
అంతకుముందు ఇదే సీజనులో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ పవర్ప్లేలో 57పరుగులు సాధించగా, ముంబయి ఇండియన్స్తో ఆడిన రెండు మ్యాచ్లలో వరుసగా పవర్ప్లేలో 56, 51 పరుగులు సాధించింది. మరోవైపు ఇప్పటికే పాయింట్లపట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్రైజర్స్.. సోమవారం హైదరాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.