హైదరాబాద్: ఏదైనా స్టేడియంలోనికి వెళ్లేటప్పుడు భద్రతా సిబ్బంది కొన్ని వస్తువులను మాత్రం లోనికి తీసుకెళ్లకుండా ఆపేస్తారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి భావోద్వేగానికి గురై ఆందోళనలు చేస్తారేమోననే ముందుజాగ్రత్తతో అలా చేస్తారు. సరిగ్గా అలానే ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్ చూసేందుకు వెళ్లాలంటే మాత్రం మన దగ్గర చిల్లర నాణేలు కూడా ఉండకూడదు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు.
ఇలా కొందరు తెలియక నాణేలను మైదానానికి తీసుకుని వచ్చి దాదాపు కాయిన్లను అడ్డుగా భావిస్తారు. దీంతో చేసేదేం లేక అక్కడే ఉన్న బాక్సులలో వాటిని వేసేసి వెళ్లిపోతారు. అయితే ఆ కాయిన్లను ఏం చేస్తారని ఓ ఇంగ్లీష్ పత్రిక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) తాజాగా అసలు విషయం తెలిసింది.
'తాళం వేసి ఉన్న ఆ బాక్సులను మేము ఓపెన్ చేయం. ఒకటి లేదా రెండు మ్యాచ్ల అనంతరం ఆ బాక్సులను సమీపంలోని ఓ దేవాలయానికి పంపిస్తాం. ఆలయ సిబ్బంది వాటిని తెరిచి అందులోని నగదును తీసుకుంటారు. అంతేకానీ ఆ డబ్బులతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ డబ్బులు మావి కాదు. అందుకే మేమే వాటిని గుడికి విరాళంగా ఇచ్చేస్తాం. ఒక్కో మ్యాచ్కు సుమారుగా రెండు వేల రూపాయలు వరకు వస్తుంటాయి' అని ఎమ్సీఏ సిబ్బంది తెలిపారు.
ఒకవేళ కాయిన్లు కాకుండా మరే ఇతర వస్తువులైనా మన దగ్గర ఉంటే వాటిని అక్కడే ఏర్పాటు చేసిన క్లాక్ రూమ్లలో అప్పగించవచ్చట. పవర్ బ్యాంక్స్, హెడ్ సెట్, బ్యాగ్స్, పెన్స్ మొదలైనవి ఏమైనా వాటిలో దాచుకోవచ్చు. ఒకప్పుడు వాటర్ బాటిళ్లు అనుమతించిన యాజమాన్యం ఇప్పుడు వాటిని కూడా నిషేదించిందట. ఇప్పుడు కేవలం నీళ్లు కావలసిన వారు అక్కడే డిస్పోజబుల్ గ్లాసులలో తాగాల్సిందేనట. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2018 ఆరంభ మ్యాచ్, ముగింపు మ్యాచ్లతో పాటు మరికొన్ని ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లు వాంఖడే వేదికగానే జరిగాయి.