తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే
చెన్నై ఇన్నింగ్స్లో తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే రావడంతో డుఫ్లెసిస్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. నాలుగో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి సందీప్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చెన్నై 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆరో ఓవర్ నుంచి షేన్ వాట్సన్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం తీసుకుంటూ గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లు ఆడాడు. మరోవైపు సురేశ్ రైనా కూడా దూకుడుగా ఆడటంతో 6, 7 ఓవర్లలో 31 పరుగులు సమకూరాయి. స్కోరు బోర్డులో వేగం పెరిగింది. దీంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ రషీద్ ఖాన్ చేతికి బంతి ఇచ్చాడు. కానీ ఈ ప్రయోగం ఫలితానివ్వలేదు.
పవర్ప్లేలో 35 పరుగులు చేసిన చెన్నై
కౌల్ను లక్ష్యంగా చేసుకుని వాట్సన్ మరో సిక్స్, ఫోర్ బాదడంతో పవర్ప్లేలో 35 పరుగులే చేసిన చెన్నై.. తర్వాతి నాలుగు ఓవర్లలో 45 పరుగులు సాధించింది. ఆ తర్వాత వాట్సన్ డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీని (33 బంతులు) పూర్తి చేసుకున్నాడు. 11.5 ఓవర్లలో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. సందీప్ వేసిన 13వ ఓవర్లో వాట్సన్ విధ్వంసం పరాకాష్టకు చేరింది. ఈ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్, రెండు ఫోర్లతో 27 పరుగులు రాబట్టి చెన్నై శిబిరంలో ఎనలేని ఆనందాన్ని నింపాడు.
బ్రాత్వైట్ వేసిన బౌన్సర్కు రైనా ఔట్
14వ ఓవర్లో బ్రాత్వైట్ వేసిన బౌన్సర్కు రైనా వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్కు 9.2 ఓవర్లలో 117 పరుగులు నమోదు చేశారు. రషీద్ బౌలింగ్ను ఆచితూచి ఆడిన రాయుడు (16 నాటౌట్) భువీ బౌలింగ్లో సిక్సర్తో టచ్లోకి వచ్చాడు. వెంటనే రషీద్ బంతిని కవర్స్లోకి పంపి వాట్సన్ (51 బంతుల్లో) సెంచరీ పూర్తి చేశాడు.
ఐపీఎల్ ఫైనల్ ఛేదనలో ఇదే మొదటి సెంచరీ
ఐపీఎల్ ఫైనల్ ఛేదనలో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అన్ని ఐపీఎల్ ఫైనల్స్లో ఇది రెండోది. ఆ వెంటనే వాట్సన్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో చెన్నై విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. చివర్లో సిద్ధార్ద్ కౌల్ ఓవర్లో షేన్ వాట్సన్ రెండు ఫోర్లు బాదగా, రాయుడు మరో ఫోర్తో విజయ లాంఛనాన్ని ముగించాడు.
షేన్ వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఓవరాల్గా వాట్సన్ ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47), యూసుఫ్ పఠాన్ (45 నాటౌట్), ధవన్ (26) చెలరేగారు. చెన్నై బౌలర్లలో శార్దుల్, కర్ణ్శర్మ, బ్రావో, జడేజా, ఎంగ్డీ ఒక్కో వికెట్ తీశారు. షేన్ వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.