పిచ్ మందకొడిగా ఉంటుందేమో:
‘మ్యాచ్ జరిగేటప్పుడు పిచ్ మందకొడిగా ఉంటుందేమో అని అంచనా వేశాం. కానీ తొలి ఇన్నింగ్స్లో బంతి చక్కగా బ్యాట్ మీదకు రావడంతో ఆశ్చర్యపోయాం. ఇది 200 పరుగులు చేయగల వికెట్ అనుకోలేదు. కానీ టీ20 మ్యాచ్లలో అలాంటివి జరుగుతుంటాయి. మ్యాచ్లో మా జట్టు బౌలర్లను తప్పుపట్టాల్సిందేమీ లేదు. వికెట్పై 400 పరుగులు పారించారంటే బౌలర్లపై ఒత్తిడి అర్థం చేసుకోవచ్చు. జట్టుకు సమతూకం తేవాలని, మరొక బౌలింగ్ వనరు అందుబాటులో ఉంటుందని సర్ఫరాజ్ను కాదని పవన్నేగిని ఎంచుకున్నాం.'
అద్భుతంగా ఆడటం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి:
'చివర్లో మన్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడటం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. టాప్ ఆర్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ ఆదుకోగలదన్న నమ్మకం కలిగింది. రాజస్థాన్ రాయల్స్లో సంజూ శాంసన్ ఆట అద్భుతం. కుర్రాళ్లను చూస్తుంటే జాతీయ జట్టుకు ప్రతిభా వనరులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది' అని కోహ్లీ తెలిపాడు.
చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు రాజస్థాన్ షాక్:
ఇదిలా ఉంటే సొంతగడ్డపై చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు రాజస్థాన్ షాకిచ్చింది. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్(92 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 217 పరుగులు చేసింది.
ఆర్సీబీపై రాజస్థాన్ బౌలర్లు ఒత్తిడి పెంచుతూ:
అత్యంత వేగంగా ఆడిన విరాట్ 26 బంతుల్లోనే హాఫ్ మార్క్ను చేరుకున్నాడు. ఆ తరువాత ప్రమాదకర డివిలియర్స్(20) కూడా అనుకున్నంతా స్థాయిలో చెలరేగలేదు. కోహ్లీ ఔటవడంతోనే ఆర్సీబీపై రాజస్థాన్ బౌలర్లు మరింత ఒత్తిడి పెంచుతూ వచ్చారు. సాధించాల్సిన రన్రేట్ ఎక్కువ ఉండటంతో చివర్లో పరుగులొచ్చినా టార్గెట్కు దగ్గర వరకు వచ్చి స్వల్ప తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది.