
హైదరాబాద్: టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆఖరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కష్టం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు తన ప్రత్యర్ధి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ఆఖరి ఓవర్లో ఓటమిపాలైతే మాత్రం అభిమానులు నిరాశకు గురవుతారు.
మంగళవారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై-కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోల్కతా అభిమానులను నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఆ జట్టు ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చెన్నై విజయానికి 17 పరుగులు కావాల్సి ఉంది. కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ సీనియర్ బౌలర్ వినయ్ కుమార్కు బంతినిచ్చాడు. వినయ్ తొలి బంతికి నోబాల్ వేయగా.. అంపైర్ ఫ్రీ హిట్ ఇచ్చాడు. దీంతో క్రీజులో ఉన్న బ్రావో కళ్లు చెదిరే రీతిలో ఫైన్ లెగ్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత 19.1 బంతికి రెండు పరుగులు రాగా, రెండో బంతికి బ్రావో సింగిల్ తీసి జడేజాకు స్ట్రైకింగ్ ఇచ్చాడు.
మూడో బంతిని వినయ్ వైడ్ బాల్ వేశాడు. 19.3 బంతికి జడేజా సింగిల్ తీశాడు. బ్యాటింగ్ చేయడానికి బ్రావో క్రీజులోకి రాగానే.. బ్రావో.. బ్రావో అంటూ చెపాక్ స్టేడియం మార్మోగిపోయింది. నాలుగో బంతిని వినయ్ కట్టుదిట్టంగా వేయడంతో బ్రావో సింగిల్తోనే సరిపెట్టుకున్నాడు.
చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సినపుడు జడేజా భారీ సిక్సర్తో చెన్నై గెలుపును లాంఛనాన్ని పూర్తిచేశాడు. దీనిపై కోల్కతా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి ఓవర్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదంటూ వినయ్ కుమార్పై సోషల్ మీడియాలో కోల్కతా అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎంతో అనుభవం ఉన్న నువ్వు ఇలా పేలవంగా బౌలింగ్ చేయడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై వినయ్ కుమార్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'హే గయ్స్ ఓటమిని ఈజీగా తీసుకోండి. గేమ్లో ఇది సాధారణమే. ఆర్సీబీతో మ్యాచ్లో 9 పరుగులు, ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అని ప్రశ్నించాడు. కొన్నిసార్లు మనం ఊహించినదానికి భిన్నంగా ఫలితాలు వస్తుంటాయి. కావున లైట్ తీసుకోండి' అని ట్వీట్ చేశాడు. వినయ్ కుమార్కి వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మద్దతు తెలిపాడు.