
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో అత్యుత్తమ స్టేడియంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ నిలిచింది. ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
అంతేకాదు ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అత్యుత్తమ స్టేడియంగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన గ్రౌండ్ సిబ్బందికి ఈ సందర్భంగా గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. 'బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్ మళ్లీ బెస్ట్ స్టేడియంగా నిలిచింది. ఐపీఎల్ 2018 సీజన్లో అత్యుత్తమ గ్రౌండ్గా ఈడెన్ ఎంపికైంది. టోర్నీ ఆరంభం నుంచి శ్రమించిన మైదానం సిబ్బందికి థ్యాంక్స్' అని గంగూలీ ట్వీట్ చేశాడు.
కాగా, ఐపీఎల్ 11వ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్తో పాటు ఏడు లీగ్ మ్యాచ్లు జరిగాయి. వాస్తవానికి ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లకి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఈ మేరకు తొలుత షెడ్యూల్ని కూడా ప్రకటించారు.
అయితే, చెన్నై చెపాక్ నుంచి తన సొంత మైదానాన్ని పూణెకి మార్చుకోవడంతో టోర్నీ మధ్యలో ఎలిమినేటర్, క్వాలిఫయిర్-2 మ్యాచ్లను ఈడెన్ గార్డెన్స్కి దక్కించుకుంది. శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.
ఇదిలా ఉంటే ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఈ పైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టు ఐపీఎల్ 2018 విజేతగా నిలుస్తుంది.