హైదరాబాద్: మహమ్మద్ షమి.. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడు. తన అద్భుతమైన బౌలింగ్తో టీమిండియాకు ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. ఇటీవల సఫారీ గడ్డపై ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాంటి ఆటగాడు ఐపీఎల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో మహమ్మద్ షమీ ఢిల్లీ డేర్డెవిల్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో షమీ ప్రదర్శనపై ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ స్పందించాడు.
వ్యక్తిగత సమస్యల కారణంగానే షమి తన బౌలింగ్పై దృష్టి సారించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. శుక్రవారం జేమ్స్ హోప్స్ మీడియాతో మాట్లాడుతూ 'షమి కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నాడు. అందుకే సరిగా బౌలింగ్ వేయలేకపోతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను' అని అన్నాడు.
'ప్రస్తుత సమయంలో క్రికెట్పై పూర్తి దృష్టి పెట్టడం ఎవరికైనా కష్టమే. ఆటగాళ్లు క్రికెట్ ఆడుతూ తమ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలి. మైదానంలో ప్రదర్శన చేసే ముందు ఎవరైనా సరే చాలా కష్టపడాలి. ప్రస్తుతం షమీ ఇదే చేస్తున్నాడు. తను ఫామ్ అందుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందని భావిస్తున్నా' అని చెప్పాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో ఆడిన షమీ 83 బంతులేసి 144 పరుగులు ఇచ్చాడు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే ఏడు పరుగులు మాత్రమే చేశాడు. వరుస పరాజయాలతో ఢిల్లీ డేర్డెవిల్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గౌతమ్ గంభీర్ కూడా కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో శుక్రవారం ఢిల్లీ డేర్డెవిల్స్ తన తొలి మ్యాచ్ని కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది.