హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
200లకుపైగా పరుగులను ఛేదించి చెన్నై జట్టు మంగళవారం కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించింది. ఇది తాజా ఐపీఎల్లో చెన్నైకు వరుసగా రెండో విజయం. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో డ్వేన్ బ్రేవో చెలరేగగా.. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సామ్ బిల్లింగ్స్ విజృంభించాడు.
203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ మైదానంలో చెన్నై జట్టు విజయోత్సవాలు జరుపుకోలేదు. భావోద్వేగాలు ప్రదర్శిస్తూ.. సంబరాలు నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి సొంతగడ్డపై చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తోన్న ధోని విజయం అనంతరం ఒకింత సంయమనంతో వ్యవహరించాడు.
ఎప్పుడూ కూల్గా కనిపించే ధోని ఈ మ్యాచ్లో మాత్రం చాలా ఆందోళనకు గురయ్యాడట. ఈ విషయాన్ని ధోనినే స్వయంగా చెప్పాడు. మైదానంలో సంబరాలు చేసుకుంటే కామెంటేటర్లు ఎక్కువగా అదే మాట్లాడుతారని, అందుకే డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిపాడు.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ 'సామ్ బిల్లింగ్స్ తన బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేశాడు. కోల్కతా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే మా జట్టు పరుగులు తీయాలి. ఇరు జట్ల బౌలర్లకు ఈ మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. అభిమానులు మాత్రం బాగా ఎంజాయ్ చేసి ఉంటారు' అని ధోని అన్నాడు.
'విజయం కోసం చివరి ఓవర్లో మా జట్టు 17 పరుగులు చేయాలి. ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురయ్యా. నా పల్స్ రేట్ బాగా పెరిగిపోయింది. అందుకే డ్రెస్సింగ్ రూమ్లోనే ఉండిపోయా. ఒకవేళ ఆ సమయంలో డగౌట్లో ఉంటే నా భావోద్వేగాల గురించే కామెంటేటర్లు మాట్లాడుకునేవారు. అందుకే బయటకు రాలేదు. నా భావాలను డ్రెస్సింగ్ రూమ్లోనే ప్రదర్శించగలను.. డగౌట్లో కాదు' అని ధోని అన్నాడు.
రెండేళ్ల తర్వాత చెప్పాక్లో విజయంతో పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. 'రెండేళ్ల తర్వాత విజయం పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్నూ, రెండో ఇన్సింగ్స్నూ ప్రేక్షకులు మ్యాచ్ను ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరినీ మేం కోరుతున్నాం' అని ధోనీ అన్నాడు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో డారెన్ బ్రావో మాయ చేశాడు. వినయ్కుమార్ బౌలింగ్ను అవలీలగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు. ఐదో బంతికి కళ్లు చెదిరే సిక్స్తో జడేజా(7 బంతుల్లో 11 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.