ఆటగాళ్లపై బూట్లు విసిరిన నిరసనకారులు
చెన్నై జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై వారు బూట్లు విసిరి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు.
ఆటకు కొద్దిసేపు అంతరాయం
దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావేరి సమస్యపై పోరాడుతున్న ఓ పార్టీకి ఆ ఇద్దరు వ్యక్తులు మద్దతుదారులుగా పోలీసులు భావిస్తున్నారు. చెపాక్లో మ్యాచ్ ఆడనిచ్చేది లేదని టీవీకే నేత వేల్మురుగన్ మ్యాచ్కు ముందే హెచ్చరించాడు.
స్టేడియంలోకి పాముల్ని వదులుతామని హెచ్చరిక
అంతేకాదు మ్యాచ్ జరిగితే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమోండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు సహా మొత్తం 4 వేల మందితో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చెపాక్ స్టేడియం వద్ద నిరసనకారులు నినాదాలతో హోరెత్తించగా.. పోలీసులు భారీ భద్రత కల్పించారు.
ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం
మ్యాచ్ ఆరంభానికి ముందే నిరసనకారులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం ఆటగాళ్లపై బూట్లు విసిరి తమ గోడును వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.