హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్ నో బాల్ వేయడమే అరుదు. అలాంటిది ఒకే ఓవర్లో రెండు నో బాల్స్ వేయడం మామూలు విషయం కాదు. ఐపీఎల్లో భాగంగా సన్ రైజర్స్ జట్టుకు, కోల్కతా జట్టుకు జరిగిన మ్యాచ్ లో భువీ తడబడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతిని దినేశ్ కార్తీక్ గాల్లోకి లేపాడు. ఫీల్డర్ క్యాచ్ అందుకున్నప్పటికీ నోబాల్ కావడంతో కోల్కతా కెప్టెన్ బతికిపోయాడు. ఫ్రీహిట్ కావడంతో తర్వాతి బంతిని సిక్స్గా మలిచాడు.
రెండు బంతుల వ్యవధిలోనే భువీ కార్తీక్ను ఔట్ చేశాడు. భువనేశ్వర్ విసిరిన నకుల్ బాల్ను కార్తీక్ ఆడబోగా.. అది బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అదే ఓవర్ ఐదో బంతిని కూడా భువీ నోబాల్ వేయడంతో జాన్సన్ బతికిపోయాడు. విలియమ్సన్ క్యాచ్ అందుకున్నప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఫ్రీ హిట్గా వేసిన బంతికి బ్యాట్స్మెన్ భారీ షాట్ ఆడకుండా భువీ జాగ్రత్తపడ్డాడు.
రెండు నోబాల్స్ వేసినప్పటికీ.. ఒక సిక్స్ సహా 12 పరుగులు మాత్రమే ఇచ్చి దినేశ్ కార్తీక్ వికెట్ను భువనేశ్వర్ పడగొట్టాడు. రెండు నోబాల్స్ కాకపోయి ఉంటే.. భువీ ఖాతాలో మరిన్ని వికెట్లు చేరేవి. ఈ మ్యాచ్లో భువీ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టాన్లేక్, షకీబుల్ హసన్ తలో రెండు వికెట్లు తీయడంతో కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులకే పరిమితమైంది.
ఒక ఓవర్ మిగిలి ఉండగానే:
ఐపీఎల్-11వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి మెరిసింది. ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆతిథ్య కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.