కొత్త.. చెత్త రికార్డు:
* ఈ ఏడాది నేపాల్ నుంచి ఓ క్రికెటర్ ఐపీఎల్లో ఆడాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ బౌలర్ సందీప్ లామిచానె నేపాల్కి చెందినవాడు. అలా నేపాల్ నుంచి వచ్చిన తొలి ఆటగాడిగా సందీప్ రికార్డులకెక్కాడు.
* ఐపీఎల్ రికార్డుల్లో ఓ చెత్త రికార్డు ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్కి చెందిన బసిల్ థంపి 4 ఓవర్లు వేసి 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్ని పరుగులు ఇచ్చుకున్న తొలి బౌలర్ థంపి గతేడాది ఎమర్జింగ్ ప్లేయర్గా అవార్డు దక్కించుకోవడం గమనార్హం.
* ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ది మరో విచిత్రమైన రికార్డు. ఈ ఏడాది కింగ్స్ పంజాబ్కి ఆడిన ఆరోన్ ఫించ్... ఇప్పటివరకు ఐపీఎల్లో ఆరు జట్ల తరఫున ఆడాడు. పంజాబ్ ఏడోది.
* అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(నాలుగు సార్లు) ముందుండేవాడు. ఇప్పుడు అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ కూడా రోహిత్ శర్మ సరసన నిలిచారు.
* ఒకే ప్రత్యర్థిని నాలుగుసార్లు ఓడించిన దాఖలాలు ఏ సీజన్లోనూ లేవు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు నాలుగుసార్లు తలపడగా అన్నింట్లోనూ చెన్నై జట్టే విజయం సాధించింది.
సెంచరీలతో రికార్డులు:
* ఈ ఐపీఎల్లో తొలి సెంచరీ చేసింది క్రిస్ గేల్. ఇది ఐపీఎల్లో అతనికి ఆరో సెంచరీ. ఈ సెంచరీతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డును భద్రపరుచుకున్నాడు.
* 2018 ఫైనల్లో సెంచరీ బాదిన ఏకైక క్రీడాకారుడు షేన్ వాట్సన్(చెన్నై సూపర్కింగ్స్). గతంలో వృద్ధిమాన్ సాహా కూడా ఫైనల్లో సెంచరీ చేసినప్పటికీ అతను ప్రాతినిధ్యం వహించిన జట్టు పరాజయం పాలైంది. * వాట్సన్కు ఈ సీజన్లో రెండు సెంచరీలు కాగా ఐపీఎల్లో ఇది నాలుగో సెంచరీ.
హాఫ్ సెంచరీల పర్వం:
* సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రమే ఈ సీజన్లో ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
* బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ... టీ 20ల్లో 54వ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో.. ఇప్పటివరకు గౌతం గంభీర్ (53) పేరున ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారతీయుడిగా తన పేరున రికార్డును లిఖించుకున్నాడు.
* ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ది. 36 హాఫ్ సెంచరీలతో వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్లో గంభీర్ 36వ హాఫ్ సెంచరీ కొట్టి ఆ రికార్డును సమం చేశాడు. * కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి చెందిన కేఎల్ రాహుల్ వేగవంతమైన ఐపీఎల్ 50 సాధించాడు. ఢిల్లీ డేర్డెవిల్స్పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
* గతంలో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కోల్కతా నైటరైడర్స్ తురుపుముక్క సునీల్ నరైన్ ఈ ఏడాది 17 బంతుల్లో మరో అర్ధ సెంచరీ చేశాడు. దీంతో 17 కన్నా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
* ఏడో డౌన్లో దిగి హాఫ్ సెంచరీ సాధించడం అంటే కొంచెం కష్టమే. కోల్కతా నైట్రైడర్స్కి చెందిన ఆండ్రీ రసెల్ ఈ ఐపీఎల్లో గత రికార్డును బద్దలు కొట్టాడు. 68 పరుగులతో బ్రావో పేరు మీద ఉన్న ఏడో డౌన్లో అత్యధిక పరుగుల స్కోరు 88 పరుగులు చేసి చెరిపేశాడు.
* ఒక సీజన్లో బ్యాట్స్మెన్ నిలకడగా రాణించడం కష్టమే. వరుసగా హాఫ్ సెంచరీలు చేయడం కష్టం. గతంలో ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్కి ఉంది. 2012లో వరసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది జాస్ బట్లర్ వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసి ఆ రికార్డును సమం చేశాడు.
సిక్సుల వర్షం:
* ఈ ఐపీఎల్లో బ్యాట్స్మెన్ ధాటికి 872 సిక్స్లు నమోదయ్యాయి. ఓ సీజన్ ఇన్ని సిక్స్లు నమోదవ్వడం ఇదే తొలిసారి. 2012లో నమోదైన 731 తర్వాత ఇదే అత్యధికం.
* రోహిత్ శర్మ సిక్స్లకు అభిమానులు ఎక్కువే. సొగసైన సిక్స్లతో అలరించే రోహిత్ తన ఖాతాను 300 దాటించేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెట్ రోహితే. ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోనీ 186 సిక్స్లు కొట్టాడు. ఇన్ని సిక్స్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్ ధోనీనే. అతని తర్వాత స్థానాల్లో సురేశ్ రైనా (185), రోహిత్ శర్మ (184), విరాట్ కోహ్లీ (178) ఉన్నారు.
* ఒకే మ్యాచ్లో రెండు జట్లూ కలిపి 33 సిక్స్లు కొట్టాయంటే నమ్మగలరా. కానీ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల బ్యాట్స్మెన్ రాణించడంతో 33 సిక్స్లు నమోదయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన మ్యాచ్ ఇది.
స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన బ్యాట్స్మెన్:
* సన్రైజర్స్ హైదరాబాద్ మీద ఢిల్లీ డేర్‘డెవిల్' రిషబ్ పంత్ 128 పరుగులు సాధించాడు. దీని వెనుకా ఓ రికార్డు ఉంది. ఐపీఎల్లో ఓ మ్యాచ్లో ఓ భారతీయ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులివీ. అంతకుముందు ఈ రికార్డు మురళీ విజయ్ (127) పేరు మీద ఉండేది.
* రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్లు తలపడితే చూడటానికి ఏ క్రికెట్ ప్రేమికుడికైనా సరదానే. అదే ఇద్దరు ఆ మ్యాచ్లో రాణిస్తే ఇంకా సూపర్ కదా. అలా వీరిద్దరూ ఓ మ్యాచ్లో రాణించి 90కి పైగా పరుగులు చేశారు. ఆ మ్యాచ్లో రోహిత్ 94 పరుగులు చేస్తే, విరాట్ 92 పరుగులు చేశాడు. ఇదీ రికార్డే.
వికెట్లు ఫటాఫట్:
* అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు ఆండ్రూ టై నిలిచాడు. మూడు మ్యాచ్ల్లో అతడు నాలుగేసి చొప్పున 12 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాడి జట్టు ఫైనల్ చేరకపోవడం ఇదే మొదటిసారి. పంజాబ్ ప్లేఆఫ్కి కూడా చేరుకోని సంగతి తెలిసిందే.
* ఐపీఎల్లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ మాయ కొనసాగింది. ఈసారీ వికెట్ల వేట కొనసాగించి తన కౌంట్ను వంద దాటించాడు. ఐపీఎల్లో వందకుపైగా వికెట్లు తీసిన తొలి విదేశీ ఆటగాడుగా నిలిచాడు.
* కింగ్స్ పంజాబ్కు చెందిన అంకిత్ రాజ్పుత్ సన్రైజర్స్ హైదరాబాద్ మీద ఐదు వికెట్లు పడగొట్టాడు. స్టార్ బౌలర్కి ఇది పెద్ద విషయం కాకపోయినా... ఇంతవరకు దేశీయ జట్టుకు ఆడని ఓ బౌలర్ ఇలా ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. ఈ ఘనత అంకిత్ కే దక్కింది.
ఒక్కడే సైన్యం:
* చెన్నై యోధుడు మహేంద్ర సింగ్ ధోనీ టీ 20ల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేశాడు. ఐదు వేల పరుగులు చేసిన తొలి టీ 20 కెప్టెన్ ధోనీనే.
* ధోనీ 150 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడి, జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ ధోనీనే.
* టీ20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. 291 టీ20లు ఆడిన మహీ ఇప్పటివరకు 144 క్యాచ్లు పట్టాడు. కుమార సంగక్కర (142) రెండో స్థానంలో ఉన్నాడు. * స్టంపింగ్స్లోనూ ధోనీదే రికార్డు. ఇప్పటివరకు 33 స్టంపౌట్లు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాబిన్ ఉతప్ప (32) పేరు మీద ఉండేది. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లాడిని శిఖర్ ధావన్ 12 క్యాచ్లు పట్టాడు. రవీంద్ర జడేజా(11), క్రిష్ణప్ప గౌతమ్(10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీనేజ్లోనే టెన్షన్ పెట్టించిన రషీద్:
* టీ 20లు ఆడటం పెద్ద విషయం కాదు. 19 ఏళ్లకే అంటే పెద్ద విషయమే కదా. అఫ్గానిస్థాన్కు చెందిన రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడిన రషీద్ వందో మ్యాచ్ ఆడటం, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించడం విశేషం.
* అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ జెద్రాన్ 17 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడు ముజీబే. అతి తక్కువ వయసులో ఐపీఎల్లో వికెట్ తీసింది కూడా జెద్రానే.