తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చాం
దీంతో మ్యాచ్ అనంతరం యువరాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చాం. కరుణ్ నాయర్ క్యాచ్ వదిలేయడం ఇక్కడ కీలకం. మేం ఆరంభంలోనే వికెట్లు తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది. మా బౌలర్ల ఆరంభం బాగాలేదు. మ్యాచ్ మధ్యలోనూ వికెట్లు తీయలేకపోయాం. ఢిల్లీ జట్టులో అందరూ 30-40 పరుగులు చేశారు' అని యువీ అన్నాడు.
భువీ, రషీద్పైనే ఎక్కువ ఆధారం
'మా జట్టు ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. నెహ్రా పూర్తి ఫిట్నెస్ సాధిస్తే బౌలింగ్ లైనప్ మరింత పటిష్టం అవుతుంది. మహ్మద్ సిరాజ్ యువ ఆటగాడు అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. సిద్ధార్థ్కౌల్ బాగా నేర్చుకుంటున్నాడు. వారిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు' అని యువరాజ్ చెప్పాడు.
మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది
'ఈ మ్యాచ్లో మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది. గత మూడు నాలుగు ఇన్నింగ్స్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సమయం లభించలేదు. తొలి ఇన్నింగ్స్లో మేం బ్యాటింగ్ చేసినప్పుడు, బౌలింగ్లో బంతిపై మా బౌలర్లు పట్టుని సాధించలేకపోతున్నారు. దీంతో 16వ ఓవర్ తర్వాత భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు' అని యువీ అన్నాడు.
41 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్గా నిలిచిన యువీ
కాగా మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 70 నాటౌట్;11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.