పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) స్టేడియంలో శుక్రవారం ఆ జట్టు 26 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించగా, లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో జేమ్స్ ఫాల్క్నర్ ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ కెప్టెన్ జార్జి బెయిలీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. కింగ్స్ ఎలెవెన్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు అజింక్యా రహానే (0), సంజూ శ్యాంసన్ (5)లతో పాటు కరుణ్ నాయర్ (8) త్వరత్వరగా నిష్క్రమించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ తరుణంలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రయత్నాలు ఎంతోసేపు కొనసాగలేదు. స్టూవర్ట్ బిన్నీతో కలసి నాలుగో వికెట్కు 39 పరుగులు జోడించిన తర్వాత స్మిత్ (33) మిఛెల్ జాన్సన్ బౌలింగ్లో కరణ్వీర్ సింగ్కు దొరికిపోగా, కొద్దిసేపటికి బిన్నీ (13) కూడా జాన్సన్ బౌలింగ్లోనే వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కాడు. అయితే దీపక్ హుడా, జేమ్స్ ఫాల్క్నర్ కొద్దిసేపు క్రీజ్లో నిలదొక్కుకుని కింగ్స్ ఎలెవెన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
దూకుడుగా ఆడిన హుడా (15 బంతుల్లో 30 పరుగులు) ఆరో వికెట్కు 51 పరుగులు జోడించిన తర్వాత అనురీత్ సింగ్ బౌలింగ్లో నిష్క్రమించగా, 33 బంతుల్లో 46 పరుగులు సాధించిన ఫాల్క్నర్ కూడా అనురీత్ బౌలింగ్లోనే డేవిడ్ మిల్లర్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రిస్ మోరిస్ (6), టిమ్ సౌథీ (0) అజేయంగా నిలువడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
కింగ్స్ ఎలెవెన్ బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు కైవసం చేసుకోగా, మిఛెల్ జాన్సన్ 2 వికెట్లు, సందీప్ శర్మ, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ అందుకున్నారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ జట్టుపై రాయల్స్ బౌలర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో కింగ్స్ ఎలెవెన్ బ్యాట్స్మన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ (0)తో పాటు వృద్ధిమాన్ సాహా (7), గ్లెన్ మ్యాక్స్వెల్ (7) త్వరత్వరగా పెవిలియన్కు చేరడంతో ఆ జట్టు 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఆ తర్వాత మురళీ విజయ్ (37), అక్షర్ పటేల్ (24), డేవిడ్ మిల్లర్ (23), కెప్టెన్ జార్జి బెయిలీ (24) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే పెవిలియన్కు పరుగు తీశారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే రాబట్టిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్క్నర్ 26 పరుగులకే మూడు వికెట్లు కైవసం చేసుకోగా, టిమ్ సౌథీ రెండు వికెట్లు, ధవళ్ కులకర్ణి ఒక వికెట్ అందుకున్నారు. పంజాబ్ జట్టు ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ రాజస్థాన్ సమష్టిగా ఆడి మ్యాచులో పైచేయి సాధించింది.