
దారుణమైన పిచ్..
'వర్షం కారణంగా ఈ మెగా ఫైనల్లో మూడున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. రిజర్వ్ డేతో కలుపుకొని కేవలం రెండున్నర రోజుల ఆట మాత్రమే సాధ్యమైంది. అయినా ఫలితం తేలిందంటే ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ప్రశ్న ఎవరు అడిగి ఉండరు. అసలు ఇంత దారుణమైన పిచ్ సిద్దం చేయమని చెప్పింది ఎవరు? పిచ్ బౌలర్లకు మాత్రమే సహకరించింది. బ్యాట్స్మన్ చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు.'అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.

ఇరు దేశాల్లో ఫైనల్ ..
రెండేళ్ల పాటు సాగే డబ్ల్యూటీసీ టోర్నీలో విజేతను ఒక్క మ్యాచ్తో తేల్చడం సరికాదని ఈ పాక్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. 'ఒకే మ్యాచ్తో డబ్ల్యూటీసీ విజేతను తేల్చడం కూడా సరికాదు. ఫైనల్కు చేరిన ఇరు జట్లకు రెండు మ్యాచ్లు నిర్వహించాలి. ఒకటి హోమ్ గ్రౌండ్, మరొకటి ప్రత్యర్థి దేశంలో ఆడాలి. రెండు మ్యాచ్లకు పాయింట్స్ కేటాయించి విజేతను నిర్ణయించాలి.
అప్పుడు ఫలితం ఫెయిర్గా ఉంటుంది. అదే ప్రపంచకప్లో అయితే ఫైనల్తో సహా ప్రతీ మ్యాచ్ ఆతిథ్య దేశంలోనే ఆడుతారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ డబ్ల్యూటీసీలో పరిస్థితి విభిన్నం. భవిష్యత్తులోనైనా ఫైనల్ను హోం, అవే విధానంలో నిర్వహించాలనేది నా అభిప్రాయం. అప్పుడు ఇరు జట్లు ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చినట్లు అవుతుంది.'అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.

బెస్టాఫ్ 3 ఫార్మాట్..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ను బెస్టాఫ్ 3 ఫార్మాట్లో నిర్వహించాలని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సూచించిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు సాగే టోర్నీలో ఒక్క మ్యాచ్తో విజేతను తేల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎడిషన్లోనైనా ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
ఇక బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించాడు. వచ్చే సీజన్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నాడు. ఇక ఇంగ్లండ్తో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల సిరీస్తో డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ ప్రారంభంకానుంది.


Click it and Unblock the Notifications












