
లక్నో: భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇటీవల పదివేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్గా నిలిచిన మిథాలీ.. తాజాగా వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్వుమెన్గా నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో ఈరోజు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో మిథాలీ 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచులో 26వ పరుగుల వద్ద మిథాలీ 7వేల పరుగులు పూర్తిచేశారు.
వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్వుమన్గా మిథాలీ రాజ్ నిలవగా.. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ (5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్గా, తొలి భారతీయ వుమెన్ క్రికెటర్గా నిలిచారు. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీ.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో 50.7 సగటుతో 7008 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా (10) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ప్రియా పునియా (32) పర్వాలేదనిపించారు. పూనమ్ రౌత్ సెంచరీతో (104 నాటౌట్; 123 బంతుల్లో 10 ఫోర్లు) మెరవగా.. హర్మన్ప్రీత్ కౌర్ (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (45, 71 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ప్రొటీస్ బౌలర్ సేఖుఖునే రెండు వికెట్లు పడగొట్టారు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రస్తుతం 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఓపెనర్లు లిజెల్ లీ (69), లారా వోల్వార్డ్ట్ (53) హాఫ్ సెంచరీలు చేశారు. ఇద్దరూ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే స్వల్ప వ్యవధిలో లిజెల్, లారా ఔట్ అవ్వడంతో ప్రొటీస్ కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 18 ఓవర్లలో 121 పరుగులు చేయాలి. లారా గూడాల్, మిగ్నాన్ డు ప్రీజ్ క్రీజులో ఉన్నారు. మరోవైపు భారత పురుషుల జట్టు ఈరోజు రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో రెండో టీ20 ఆడనుంది.