
దుబాయ్: దక్షిణాఫ్రికా-భారత్ మహిళా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పు చేసింది. ఈ షెడ్యూల్లో ఐసీసీ అదనంగా మరో టీ20 మ్యాచ్ను చేర్చింది. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దక్షిణాఫ్రికా-భారత్ మహిళల ఐదు టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో.. ఒక టీ20ని షెడ్యూల్లో చేర్చారు. ఇరుజట్ల మధ్య ఇప్పటికే నాలుగు టీ20లు ముగియగా.. భారత్ రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదవ టీ20 శుక్రవారం రాత్రి జరుగనుంది.
ఇక భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఆరవ టీ20 వచ్చే నెల 3వ తేదీన సూరత్లో జరగనుంది. ఐసీసీ తాజా నిర్ణయంతో ఐదు టీ20ల సిరీస్ కాస్తా ఆరు టీ20ల సిరీస్గా మారింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా గెలిస్తే.. సిరీస్ 2-2తో సమం అవుతుంది. అదే సమయంలో భారత్ కనీసం ఒక మ్యాచ్ గెలిచినా సిరీస్ను సొంతం చేసుకుంటుంది. భారత మహిళల ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. రెండు టీ20లను కూడా సునాయాసంగా గెలిచే సూచనలు ఉన్నాయి.
తొలి మ్యాచ్, నాలుగో మ్యాచ్ భారత్ గెలవగా.. రెండు, మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యాయి. సూరత్ వేదికగా మంగళవారం జరిగిన నాలుగో టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 51 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్లో స్పిన్నర్ల విజృంభణతో విజయం సాధించిన భారత్.. నాలుగో టీ20లోనూ అదే మంత్రం ప్రయోగించి సక్సెస్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. మొదట టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది.
టీ20 సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదవ టీ20 శుక్రవారం రాత్రి 7 గంటలకు సూరత్లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరగనుంది. సీనియర్ మిథాలీ రాజ్ స్థానంలో అరంగేట్రం చేసిన 15 ఏండ్ల షఫాలీ వర్మపై అందరి దృష్టి ఉండనుంది. దూకుడుగా ఆడే షఫాలీ మరోసారి బ్యాట్ జుళిపిస్తే.. మంచి ఆరంభం దక్కనుంది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మంచి ఫామ్లో ఉండడం కలిసొచ్చే అంశం. హర్మన్కు తోడు స్మృతి మందన, రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి సహకారం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ మరోసారి విజృంభిస్తే.. సఫారీలకు కష్టాలు తప్పవు. రాధా యాదవ్ ఫామ్ కూడా టీమిండియాకు లాభించనుంది.