
హైదరాబాద్: జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారికి ఖైదువంటి కఠిన శిక్షలు విధించాలని ప్రధాని నరేంద్ర మోడీకి చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ లేఖ రాశాడు. 1960 జంతు సంరక్షణ చట్టంలోని శిక్షలు చాలా సరళంగా ఉన్నాయని, కేవలం రూ.50 అత్యధిక జరిమానా విధించడం అనేది కాలం చెల్లిన శిక్షలని అందులో పేర్కొన్నాడు.
జంతు సంరక్షణ చట్టాలను బలీయం చేయాలని పెటాతో చేతులు కలిపిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రహానేల సరసన తాజాగా చాహాల్ కూడా చేరాడు. ఇందులో భాగంగా ప్రధాని మోడీకి చాహాల్ లేఖ రాశాడు. ఈ సందర్భంగా చాహాల్ మాట్లాడుతూ ఎవరైతే జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారో వారికి జైలు శిక్షను విధించడమే సరైన మార్గమని తెలిపాడు.
"భారత్లో ఆవులు, కుక్కలతో మిగతా జంతువులను హింసించమనేది తరచు చూస్తున్నాం. జంతువుల్ని కొట్టడం, విష ప్రయోగాలు చేయడం. యాసిడ్తో ఎటాక్ చేయడం. లైంగిక హింసలకు పాల్పడటనేది నిత్యం కనిపిస్తూనే ఉంది. అది చాలా బాధాకరం. దీన్నిఅరికట్టాలంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అమలు చేయడమే సరైన మార్గం" అని చాహల్ తన లేఖలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో యుజవేంద్ర చాహాల్కు చోటు దక్కలేదు. దీంతో ప్రస్తుతం యజువేంద్ర చాహాల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.