పృథ్వీ షా కొంపముంచిన ఓవర్ వెయిట్.. బరువు తగ్గితేనే టీమిండియాలో చోటు.. సెలెక్టర్ల వార్నింగ్!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. అయితే ఈ జట్టులో యువ ఓపెనర్ పృథ్వీషాకు చోటు దక్కలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో పృథ్వీ షాకు మళ్లీ టీమిండియాలో చోటు దక్కుతుందని అంతా భావించినా.. అతనికి సెలక్టర్లు మొండిచెయ్యే చూపించారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ నలుగురు ఓపెనర్లతో పాటు బ్యాకప్గా అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేశారు.

కొంపముంచిన ఓవర్ వెయిట్..
అయితే పృథ్వీ షాకు సెలెక్టర్ల నుంచి ఇది వేకప్ కాల్ అని, అతని అధిక బరువే జట్టులో చోటు దక్కకుండా చేసిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియాలో మళ్లీ చోటు దక్కాలంటే పృథ్వీ షా బరువు తగ్గాల్సిందేనని అతనికి సెలెక్టర్లు సూచించినట్లు ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఈ విషయంలో అతను రిషభ్ పంత్ను చూసి నేర్చుకోవాలన్నారు. పంత్ కూడా జట్టులో నుంచి తీసేసిన తర్వాతే ఫిట్నెస్పై దృష్టి పెట్టాడని, బరువు తగ్గి ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాడని ఉదహారణగా పేర్కొన్నారు.

పంత్ బాటలో..
'21 ఏళ్ల పృథ్వీ షా మైదానంలో చాలా నెమ్మదిగా కదులుతుంటాడు. అతను కొంచెం బరువు తగ్గాలి. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డర్గా అతను చేసిన తప్పిదాలను సవరించుకోవాలి. ఆ పర్యటన అనంతరం అతను చాలా కష్టపడుతున్నాడు. తన టెక్నిక్ లోపాన్ని సవరించుకున్నాడు. అతను రిషభ్ పంత్ను చూసి నేర్చుకోవాలి. పంత్ కూడా కొన్ని నెలల వ్యవధిలోనే పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పృథ్వీ షా కూడా చేయగలడు.'అని సదరు అధికారి పేర్కొన్నారు.

ఫామ్ కొనసాగించాలి..
ఫామ్ను కొనసాగించడంలో కూడా పృథ్వీ షా తడబడుతున్నాడని, ఓ సిరీస్లో బాగా రాణించాడని ఎంపిక చేస్తే.. తర్వాతి టోర్నీల్లో తడబడుతున్నాడని తెలిపారు. 'ఫామ్ను కొనసాగించడంలో పృథ్వీ షా తడబడుతున్నాడు. ఒక్క సిరీస్ బాగా రాణించాడని జట్టులోకి తీసుకుంటే దారుణంగా విఫలమవుతున్నాడు. అతను తన ఫామ్ను కొనసాగించాలి'అని తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పృథ్వీ షా మైదానంలో వేగంగా పరుగెత్తలేకపోతున్నాడు. వికెట్ల మధ్య కూడా పరుగు తీయడానికి అతను పెద్దగా ఇష్టపడడు. భారీ షాట్లు ఆడేందుకే ప్రయత్నిస్తుంటాడు.

ఒడిదుడుకులు ప్రయాణం..
భారత్ తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి పృథ్వీ కెరీర్ పడుతూ లేస్తూ కొనసాగుతుంది. తొలుత గాయాలతో ఇబ్బంది పడ్డ షా.. ఆ తర్వాత నిషేధిత దగ్గుమందు తీసుకొని బ్యాన్కు గురయ్యాడు. గత ఐపీఎల్ సీజన్తో రీ ఎంట్రీ ఇచ్చిన అతను ఆరంభంలో అదరగొట్టాడు. కానీ చివర్లో ఘోరంగా విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాటింగ్, ఫీల్డింగ్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం భారత్కు వచ్చిన షా తన బ్యాటింగ్ లోపాన్ని సరిచేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్తో 800కు పైగా పరుగులు చేశాడు. తాజా ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరును కొనసాగించాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటు, 166 స్ట్రైక్రేట్తో 308 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications