
హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్కప్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం ది మాల్ రోడ్డులో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రారంభ వేడుకల్లో భాగంగా వరల్డ్కప్లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్ IIను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ధరించిన డ్రెస్పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల కెప్టన్లు అందరూ సూట్ ధరంచగా... సర్ఫరాజ్ మాత్రం కుర్తా, పైజామా లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాడు. అంతేకాదు కుర్తా, ఫైజమాపై పాక్ టీమ్ బ్లేజర్ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని సర్ఫరాజ్ని అభిమానులు అభినందించగా, కొంతమంది సర్ఫరాజ్కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదంటూ ట్రోల్ చేశారు.
"అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాక్ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సర్ఫరాజ్కు భారత జట్టు అభిమానులు అండగా నిలిచారు.