బ్రిస్టల్: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్లు భారత బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో మిథాలీసేన ఫస్ట్ ఇన్నింగ్స్లో 231 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు స్మృతి మంధాన(155 బంతుల్లో 78), షెఫాలీ వర్మ(152 బంతుల్లో 96) మినహా అంతా విఫలమయ్యారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో మరో 64 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది.
దీప్తి శర్మ(73 బంతుల్లో 29 నాటౌట్) పోరాడినా.. కెప్టెన్ మిథాలీ రాజ్(4), హర్మన్ ప్రీత్ కౌర్(4)తో సహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ(4/88) నాలుగు వికెట్లతో భారత మహిళల పతనాన్ని శాసించగా.. కేథరిన్ బ్రంట్, అన్య శృబ్సోల్, నాట్ సివర్, కేట్ క్రాస్ తలో వికెట్ తీయగా.. కెప్టెన్ హేథర్ నైట్ రెండు వికెట్లు దక్కించుకుంది.
187/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత మహిళలు 81.2 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటయ్యారు. అనుభవం లేమి, ఓపికగా ఆడటం తెలియక భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో మిథాలీ సేనకు ఫాలో ఆన్ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 396/9 వద్ద డిక్లెర్ ఇచ్చింది. వారి ఇన్నింగ్స్లో కెప్టెన్ హేథర్ నైట్(95), టామీ(66),సోఫియా డాంక్లీ(74 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.