హైదరాబాద్: వరల్డ్కప్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాకు గట్టి పోటీనిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తెలిపాడు. టోర్నీలో భాగంగా ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్ మాట్లాడుతూ "మూడు నెలల ముందు వరకు బలహీనంగా కనిపించిన ఆస్ట్రేలియా ఇప్పుడు బలంగా మారింది. వరుసగా 10 వన్డేలు గెలిచింది. అందులో మూడు కోహ్లీ సేనపై గెలిచి సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై భారత్ సులభంగానే విజయం సాధించినా అది ఆకట్టుకొనే ప్రదర్శన కాదు" అని బోర్డర్ అన్నాడు.
"దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన ఇబ్బంది పడింది. సఫారీలు సైతం బాగా ఆడారు. అయితే ఎక్కువ పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడి భారత్కు విజయం అందించాడు. ప్రస్తుతం భారత జట్టులో కొన్ని బలహీనతలు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా ఆ జట్టులో ఉన్నారు" అని అన్నాడు.
"జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా ఫరవాలేదు. అత్యుత్తమంగా ఆడకపోయినా కొన్ని మ్యాచులు గెలవొచ్చు. కానీ, టీమిండియాతో తలపడేటప్పుడు మాత్రం అత్యుత్తమంగా ఆడాలి. ఆస్ట్రేలియాకు టీమిండియానే అడ్డంకి. టోర్నీలో మిగతా మ్యాచుల్లో ఎలా ఆడాలో టీమిండియాకు అవగాహన వస్తుంది. ఆసీస్ టోర్నీని అద్భుతంగా ఆరంభించింది"అని బోర్డర్ తెలిపాడు.
దక్షిణాఫ్రితాతో జరిగిన మ్యాచ్లో చాహల్ (4/51), బుమ్రా(2/35) విజృంభణకు తోడు రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.